యువకుడిని చితక్కొట్టి..వీడియో తీయించిన తృప్తి?

పురుషులతో సమానంగా మహిళల్ని కూడా శనిసింగనాపూర్, త్రయంబకేశ్వర్ లాంటి ఆలయాల్లో ప్రవేశం కల్పించాలని పోరాడిన భూమాత బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తిదేశాయ్ మరోసారి వార్తల్లోకెక్కారు.  పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని నడిరోడ్డుపై చితకబాదారు తృప్తి. లాంధే అనే వ్యక్తి 24 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

 

బాధితురాలు గర్భం దాల్చడంతో ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. దీంతో బాధితురాలు పోలీసుల దగ్గరకు వెళ్లిందని..అయితే లాంధే ఆమెను పెళ్లి చేసుకుంటానని సర్దిచెప్పడంతో ఎలాంటి ఫిర్యాదు చేయలేదు..అయితే లాంధే మరోసారి మాటతప్పడంతో సదరు మహిళ తనను కలిసిందని..దీంతో నిందితుడికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నానని తృప్తిదేశాయ్ తెలిపారు. వెంటనే అతన్ని నడిరోడ్డుపైకి యిడ్చి తృప్తి చెప్పుతో చితకబాదారు..అంతేకాకుండా ఈ ఘటనను వీడియో తీయించి అందరికి పంచారు. మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా వూరుకునేది లేదని..అందుకోసం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికైనా వెనుకాడబోనని తృప్తి అన్నారు.