పాలిటిక్స్లో ఫుల్ యాక్టివ్గా బాలకృష్ణ.. టీడీపీలో ఫుల్ జోష్
posted on Jan 9, 2021 12:06PM
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాజాగా హిందూపురం నియోజకవర్గంలో చేపడుతున్న పర్యటన ఇపుడు రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆయన పర్యటనలో వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తే ఇక అయన పూర్తి స్థాయి పొలిటీషియన్ గా మారిపోయారని ఇటు టిడిపి లో అటు ప్రజలలోను పెద్ద చర్చ జరుగుతోంది.
మొన్నటి వరకు ఎదో తన నియోజకవర్గం హిందూపురం వరకు పర్యటించి అక్కడి సమస్యల గురించి మాట్లాడే వారు. అటువంటిది తాజాగా బాలయ్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను లేవనెత్తుతూ జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేయటం ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా ప్రత్యర్థి పక్షాలపైన పెద్దగా సప్నదించని బాలకృష్ణ తాజాగా రాష్ట్ర మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేస్తూ వార్నింగ్ ఇవ్వటం పెద్ద సంచలనం అయింది. అంతేకాకుండా రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు, సమస్యలపైన, అలాగే రాష్ట్రంలోని ఆలయాలపై జరుగుతన్న దాడులు వరకు అన్నింటిపైనా అయన స్పందించారు. మరోపక్క టీడీపీ నేతలతో కలిసి ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల వద్ద ధర్నా చేసి.. వాటిని వెంటనే లబ్దిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేసారు. మొత్తానికి బాలకృష్ణ తాజా హిందూపూర్ పర్యటనలో ఒకపక్క అధికార వైసీపీని ఏకిపారేస్తూ.. మరోపక్క పంట నష్టపోయిన రైతన్నలను పరామర్శించి వారికి తాను అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. మరోపక్క రైతుల సమస్యలపై జగన్ సర్కార్ కనుక దిగిరాకపోతే డిల్లీ తరహా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బాలకృష్ణ తాజా పర్యటనలో అయన పొలిటికల్ గా ఫుల్ యాక్టివ్ కావడం చూసి టీడీపీ కేడర్ మొత్తం ఫుల్ జోష్ లో ఉన్నారు.