జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం!!

 

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఏపీ ప్రణాళికా బోర్డును రద్దు చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రణాళికా బోర్డు స్థానంలో నాలుగు ప్రాంతీయ ప్రణాళికా బోర్డులను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఏపీలో అన్ని ప్రాంతాలను అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా 4 ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతీయ ప్రణాళికా బోర్డులు ఆయా ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి కోసం పనిచేయనున్నాయి. ప్రధానంగా సామాజిక అసమానతలతో పాటు అభివృద్ధి, సామాజిక, మౌలిక వసతుల్లో వ్యత్యాసాలను నివారించడం ద్వారా అన్ని ప్రాంతాల్లో సమాన అవకాశాలను కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని  ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

విజయనగరం జిల్లా కేంద్రంగా (శ్రీకాకుళం,  విజయనగరం, విశాఖపట్టణం) ఉత్తరాంధ్ర ప్రాంతీయ ప్రణాళిక బోర్డు.. కాకినాడ కేంద్రంగా తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల ప్రాంతీయ ప్రణాళిక బోర్డు.. గుంటూరు కేంద్రంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల ప్రాంతీయ ప్రణాళిక బోర్డు.. కడప కేంద్రంగా చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రాంతీయ ప్రణాళిక బోర్డు ఏర్పాటు చేయనున్నారు.

ప్రాంతీయ ప్రణాళిక బోర్డులకు కేబినెట్‌ స్థాయి ర్యాంకులో మూడేళ్ల కాల వ్యవధికి చైర్మన్‌ నియామకం ఉంటుంది. వ్యవసాయం (ఫుడ్‌ ప్రాసెసింగ్‌–అగ్రి మార్కెటింగ్‌) నీటి నిర్వహణ, ఆర్థిక వృద్ధి - మౌలిక వసతులు, సమ్మిళిత అభివృద్ధి - సంక్షేమ రంగాలకు చెందిన నలుగురు నిపుణులను సభ్యులుగా నియమిస్తారు.