మొన్న మోడీ, నేడు షా.. వరుస భేటీలతో విపక్షాలను భయపెడుతున్న జగన్!!

ఏపీ సీఎం జగన్ ఈరోజు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం ప్రధాని మోడీతో సుదీర్ఘ భేటీ అయ్యారు జగన్, ఇవాళ మళ్లీ అమిత్ షాతో భేటీకి పిలుపు రావడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిగ్గా మారింది. అమిత్ షాతో పాటు, మరికొందరు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

మూడు నెలలుగా సీఎం జగన్ ను పట్టించుకోని కేంద్రం ఆకస్మికంగా వరుస భేటీలకు అవకాశం ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ప్రధానితో జరిగిన సుదీర్ఘభేటీలో విభజన సమస్యలు, పెండింగ్ నిధులతో పాటు మూడు రాజధానులు, శాసన మండలి రద్దు అంశాలను ప్రస్తావించారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించటంతో సీఎం జగన్ సక్సెస్ అయ్యారు. ప్రధానితో భేటీ తర్వాత ప్రభుత్వంతో పాటు వైసీపీ కూడా ఫుల్ జోష్ లో ఉంది. ముఖ్యంగా ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆందోళనలు, ఆరోపణలు చేస్తుండటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి అది కూడా ప్రధాని మోడీ వీటిపై సానుకూలంగా వ్యవహరించటం వైసీపీలో ఉత్సాహాన్ని నింపింది. 

ప్రధానితో జరిగిన భేటీలో ప్రస్తావించిన మూడు రాజధానులు శాసనమండలి రద్దుతో పాటు హైకోర్టు తరలింపు వ్యవహారాలను కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగంగానే హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ ప్రత్యేక భేటీ కోసం మళ్లీ ఢిల్లీ వెళుతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ చట్టం, కర్నూలు జుడీషియల్ రాజధాని ప్రకటనతో హై కోర్టు తరలింపు వ్యవహారానికి సంబంధించిన అంశాలను అమిత్ షాతో చర్చిస్తారు. మహిళల రక్షణ కోసం అమలు చేస్తున్న దిశా యాక్టుతో పాటు రాష్ట్ర విభజనకు సంబంధించిన తొమ్మిది, పది షెడ్యూల్స్ అంశాలు కూడా చర్చించనున్నారు. 

అమిత్ షాతో భేటీ తర్వాత మరికొందరు కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానితో భేటీలో రెవెన్యూ లోటు, విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, కడప స్టీల్ ప్లాంట్ అంశాలున్న నేపథ్యంలో ఆయా మంత్రిత్వ శాఖల మంత్రులతో భేటీ అయ్యే అవకాశముంది. అవసరమైతే ఇవాళ రాత్రి ఢిల్లీలోనే బస చేసి, రేపు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ ను కలవనున్నట్లు సమాచారం. మొత్తానికి కేంద్రంతో రెండు రోజులుగా సాగుతున్న చర్చలు, సానుకూల ధోరణి అధికార పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మూడు నెలలుగా ప్రతిపక్షాలతో ఎదురవుతున్న అడ్డంకులు, అవరోధాలు తొలగిపోతే పాలనపై పూర్తి దృష్టి సారించే అవకాశాలుంటాయని భావిస్తోంది.