మరో యువతి అదృశ్యం.. హైదరాబాద్ లో ఏం జరుగుతుంది?

 

నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం కేసు కలకలం రేపింది. హైదరాబాద్ నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మౌనిక అనే యువతి అదృశ్యమై 3 రోజులు గడుస్తున్నా ఆమె ఆచూకీ లభించలేదు. ఈ నెల 26 న తనను ఓ యువకుడు వేధిస్తున్నాడంటూ తండ్రికి మౌనిక ఫోన్ చేసింది. ఆమెకు ధైర్యం చెప్పి.. హైదరాబాద్ కు అన్నయ్యను పంపిస్తానని అతనితో కలిసి ఇంటికి వచ్చేయమని సూచించారు తండ్రి శ్రీనివాస్. బుధవారం (నవంబర్ 27వ తేదీన) అన్నయ్య నందరాజ్.. హాస్టల్ కు వెళ్లి చూడగా మౌనిక అక్కడ లేకపోవడంతో తండ్రికి సమాచారం అందించారు. ఇద్దరూ కలిసి అమ్మాయి కోసం వెతికి చివరకు పోలీసులకు సమాచారమందించారు.

ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు మౌనిక హాస్టల్ లో గాలించగా సూసైడ్ నోట్ లభ్యమైంది. తాను ట్యాంక్ బండ్ లో దూకి చనిపోతున్నానని.. నా శవాన్ని తీసుకు వెళ్ళు నాన్నా అంటూ కూడా మౌనిక సూసైడ్ లెటర్ రాసి హాస్టల్ నుంచి మాయమైంది. హాస్టల్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ నుంచి బయటకు వచ్చిన తరువాత మౌనిక ఆటోలో ట్యాంక్ బండ్ వైపు వెళ్లినట్లు సమాచారం . ఆ తర్వాత మౌనిక ఏమైందన్న కోణంలో పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టారు.