నేనుసైతం నా రాష్ట్రం కోసం..

 

రాష్ట్ర విభజన విషయంలో గత కేంద్ర ప్రభుత్వం తన స్వంత లాభం కోసం ఏకపక్షంగా వ్యవహరించి, అభివృద్ధిలో వాటాని నిరాకరించి కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇచ్చింది. 1956 తరువాత రాజధానిలో ఏర్పరిచిన, అభివృద్ధి చేసిన అత్యంత విలువైన ఆస్తులు పోయి 1.2 లక్షల కోట్ల అప్పులు, అలాగే దాదాపు 15వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ సీమాంధ్రకు లభిస్తున్నాయి. అలాగే 20వేల కోట్ల రూపాయల మిగులు ఆదాయం వచ్చే రాజధాని హైదరాబాద్‌ని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన గత కేంద్ర ప్రభుత్వం ఇన్‌స్టాల్‌మెంట్ లోనుకి కూడా తీరని అప్పుని సీమాంధ్రకి ఇచ్చింది. అయితే జరిగిన దానిని గురించి ఇక ఆలోచించకుండా కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి వాస్తవాలు పరిగణనలోకి తీసుకుని అనేక సమస్యలు ఉన్నా ధైర్యంగా ముందడుగు వేస్తూ 'ఆంధ్రప్రదేశ్' రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుకోవడానికి బాటలు పరుచుకోవాలి. ఈ బాధ్యత మొత్తం కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే మోయలనడం సరికాదు. రాష్ట్రాభివృద్ధిని, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాంక్షించే లక్షలాది ప్రజలు ఈ బాధ్యతలో భాగస్వాములనైప్పుడే మంచి ఫలితాలను సాధించవచ్చును.