రాజధాని రగడ టైంలో ఆసక్తికర వార్త.. అమరావతికి అవార్డు!!
posted on Jan 24, 2020 3:26PM
ఏపీ రాజధానిని అమరావతి నుండి తరలించవద్దంటూ ఆందోళన వ్యక్తమవుతోన్న వేళ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓవైపు రాజధానిని అమరావతి నుండి తరలించాలని ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే.. మరోవైపు ఈ నగరానికి ప్రతిష్టాత్మక అవార్డు లభించడం ఆసక్తికరంగా మారింది. స్మార్ట్ నగరాల అంశంలో రికగ్నేషన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ కేటగిరీలో అమరావతికి పురస్కారం లభించింది. స్మార్ట్ సిటీ మిషన్ లక్ష్యాలను చేరుకోవడంలో కనబర్చిన పురోగతి ఆధారంగా అమరావతిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. విశాఖలో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో.. స్మార్ట్ సిటీల మూడో శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో భాగంగా పలు అంశాల్లో ఆదర్శంగా నిలిచిన నగరాలకు అవార్డులు అందిస్తున్నారు. కాగా, విశాఖకు వినూత్న ఆవిష్కరణల అంశంలో ఫ్లోటింగ్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుపై అవార్డు అభించింది.