జగన్ ను బయటకు రాకుండా ఆపలేరు: విజయమ్మ
posted on May 28, 2013 5:13PM
జగన్ అక్రమ నిర్బంధానికి నిరసనగా ఇందిరా పార్క్ వద్ద విజయమ్మ దీక్ష చేపట్టారు. ఇందులో జగన్ సతీమణి భారతి కూడా పాల్గొన్నారు. 'వైఎస్ జగన్ మీద ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. జగన్ కు ఖచ్చితంగా బెయిలు వస్తుంది. సీబీఐ ఇంకా ఎన్ని ఛార్జిషీట్లు వేస్తుంది. కుట్ర పూరితంగా చేసి ఎంతకాలం జగన్ ను బయటకు రాకుండా ఆపలేదు' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. విలువలు లేని చంద్రబాబుకు మమ్మల్ని విమర్శించే హక్కు లేదు. టీడీపీ, కాంగ్రెస్ కుట్రలు ప్రజలకు తెలుసు. వైఎస్ మరణించిన తరువాత మా కుటుంబాన్ని ఎన్నో బాధలు పెట్టారు. మా ఇబ్బందులను చూసి కొందరు ఆనందపడుతున్నారని విజయమ్మ అన్నారు. ప్రజల పక్షాన పోరాడే వారు ఉండకూడదనే జగన్ ను జైలుకు పంపారని, దేవుడు ఉన్నాడని, తప్పక న్యాయం జరుగుతుందని జగన్ సతీమణి భారతి అన్నారు. ఎలాంటి తప్పు చేయకుండా ఏడాదిపాటు జైలులో పెట్టడం అన్యాయం అని, వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని, అధికారం అనుభవిస్తున్న వారు వైఎస్ వల్లనే ఆ స్థానంలో ఉన్నారని, వైఎస్ కుటుంబ సభ్యులం అయిన తమకే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆమె ప్రశ్నించారు.