కేసీఆర్.. వంద అబద్ధాలు

 

 

 

ఇన్నాళ్లూ కేసీఆర్ తన పార్టీని విలీనం చేస్తారేమో, కనీసం పొత్తుకైనా సరేనంటారేమో అని ఎదురు చూస్తూ సంయమనం పాటించిన కాంగ్రెస్ నాయకులు.. ఇక ఆ ఆశలన్నీ అడుగంటి పోవడంతో నోళ్లు విప్పడం మొదలుపెట్టారు. ‘కేసీఆర్.. వంద అబద్ధాలు’ పేరుతో ఏకంగా ఓ పుస్తకం విడుదల చేయాలని నిర్ణయించారు. టీఆర్‌ఎస్‌ స్థాపించినప్పటినుంచి ఇప్పటివరకు కేసీఆర్ చెప్పిన మాటలు, వాటిని మార్చుకున్న తీరును ఎండగడుతూ ఈ పుస్తకం ఉండబోతోంది. పార్టీ పెట్టినప్పుడు తన కుటుంబ సభ్యులెవరికీ పార్టీలో చోటు ఉండబోదని చెప్పడం, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ప్రకటించి మాటతప్పడం, 2004, 2009 ఎన్నికల్లో కేసీఆర్ అనుసరించిన తీరు, 2009 ఎన్నికల ఫలితాలు వెలువడకముందే బీజేపీ పంచన చేరిన వైనం.. ఇలా అన్నీ ఇందులో ఉంటాయట. వారం రోజుల్లోపే ఈ పుస్తకాన్ని విడుదల చేయాలని టీ-పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఉత్సాహంగా కనిపిస్తున్నారు.