షాకింగ్.. కరోనాతో యువ రచయిత, దర్శకుడు నంద్యాల రవి మృతి
on May 14, 2021
కొవిడ్ మహమ్మారి టాలీవుడ్లో మరొకరిని బలి తీసుకుంది. యువ రచయిత, 'లక్ష్మీ రావే మా ఇంటికి' సినిమా దర్శకుడు నంద్యాల రవి కొవిడ్-19తో పోరాడుతూ, అలసిపోయి ఈరోజు ఉదయం మృతి చెందారు. ఏప్రిల్లో ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యి, శ్వాసక్రియ సమస్యలు ఎదుర్కొంటూ హాస్పిటల్లో చికిత్స పొందుతూ వచ్చారు.
రీసెంట్గా ఆయన రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'ఒరేయ్ బుజ్జిగా', 'పవర్ ప్లే' సినిమాలకు రచన చేశారు. నాగశౌర్య, అవికా గోర్ జంటగా నటించిన 'లక్ష్మీ రావే మా ఇంటికి' సినిమాని ఆయన డైరెక్ట్ చేశారు. మూడు రోజుల క్రితమే ఫిల్మ్ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ మృతితో షాక్లో ఉన్న టాలీవుడ్.. ఇప్పుడు నంద్యాల రవి మరణంతో మరింత దిగ్భ్రాంతికి గురయ్యింది.
కొవిడ్తో రవి పోరాడుతున్నారన్న వార్త తెలియయడంతో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఆయనను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించారు. హాస్పిటల్ బిల్స్కు 'ఒరేయ్ బుజ్జిగా' నిర్మాత కె.కె. రాధామోహన్, కమెడియన్ సప్తగిరి డబ్బు సాయం చేశారు. నంద్యాల రవి మృతికి తెలుగువన్ టీమ్ సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తోంది.