జీవిత అలా, ఫైనాన్షియర్ ఇలా.. 'శేఖర్' వివాదంలో గెలుపు ఎవరిది?
on May 24, 2022
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ 'శేఖర్' మే 20న థియేటర్స్ లో విడుదల కాగా ఓ వివాదం కారణంగా రెండు రోజులకే ఈ సినిమా ప్రదర్శనకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. 'శేఖర్' మూవీ కోసం తన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు నిర్మాత, దర్శకురాలు జీవిత రాజశేఖర్ తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్షియర్ ఎ. పరంధామరెడ్డి కోర్టును ఆశ్రయించడంతో.. ఈ సినిమా ప్రదర్శన నిలిచిపోయింది. అయితే ఇప్పుడు ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. సినిమా ప్రదర్శనకు రూట్ క్లియర్ అయింది. అయితే ఈ వివాదంలో తమది విజయమంటే తమది విజయమని జీవిత పీఆర్ టీమ్, ఫైనాన్షియర్ పీఆర్ టీమ్ వేరువేరుగా ప్రెస్ నోట్స్ విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది.
'శేఖర్' సినిమా వివాదంలో జీవిత రాజశేఖర్ గెలుపు అంటూ ప్రెస్ నోట్ విడుదలైంది. అందులో "ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా గత శుక్రవారం విడుదలైన శేఖర్ సినిమా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో జీవిత రాజశేఖర్, శేఖర్ చిత్రబృందం సభ్యులకు అనుకూలంగా కోర్టులో న్యాయమూర్తి మాట్లాడినట్టు తెలుస్తోంది. 'శేఖర్' సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించారు. అయితే, కోర్టు సినిమా ప్రదర్శనకు ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. శేఖర్ సినిమాను నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చు. జీవిత రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు మంగళవారం విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు." అని ఆ ప్రకటనలో ఉంది.
ఈ వివాదంలో ఫైనాన్షియర్ పరంధామరెడ్డి టీమ్ వాదన మరోలా ఉంది. తమదే విజయమని తెలుపుతూ వారి నుంచి మీడియాకి ఓ ప్రకటన విడుదలైంది. "శేఖర్ సినిమా గురించి న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. శేఖర్ సినిమా ఆగిపోవడంతో మాకు ఎంతో నష్టం జరుగుతుంది. ఈ సినిమా నెగటివ్ మీద ఉన్న స్టేని క్యాన్సిల్ చేయమని జీవిత రాజశేఖర్ అడ్వకేట్స్ కోరగా పరంధామ రెడ్డి తరపున అడ్వకేట్స్ సినిమా ప్రదర్శించుకొనుటకు మాకెటువంటి అభ్యంతరం లేదని, అయితే ఆవచ్చే కలక్సన్స్ లో మాక్లైంటు కి రావలసిన 87లక్షల10వేల రూపాయల ని కోర్ట్ లో డిపాజిట్ చేయించాలని జడ్జి గారిని కొరటంతో దానికి జడ్జి గారు ఏకీభవించటంతో అందుకు జీవిత రాజశేఖర్ న్యాయవాదులు ఒప్పుకుంటూ సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి వచ్చే డబ్బు ని డిపాజిట్ చేస్తామని తెలియజేశారు. రెండు రోజుల లో ఆ అక్ంట్ డీటైల్స్ కోర్టుకి తెలియచేయాలని జడ్జి గారు ఆర్డర్ ఇవ్వడం తో సినిమా ప్రదర్శనకు అనుమతి లభించింది అని తెలిసింది." అంటూ ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తానికి శేఖర్ సినిమా ప్రదర్శనకు రూట్ క్లియర్ అయిందని అర్థమవుతోంది. అయితే ఈ వివాదంలో ఎవరిది గెలుపు అనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.