రేఖను తప్పించుకొని తిరిగిన అక్షయ్ కుమార్!
on Nov 20, 2020
అక్షయ్ కుమార్ను యాక్షన్ స్టార్గా మార్చిన సినిమాల్లో 'ఖిలాడియోం కా ఖిలాడి' (1996) ఒకటి. ఆ యాక్షన్ థ్రిల్లర్లో అక్షయ్ జోడిగా రవీనా టాండన్ నటించగా, ఎవర్గ్రీన్ బ్యూటీ రేఖ ఓ కీలక పాత్ర పోషించారు. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది. అదే సమయంలో ఆ సినిమాలో మరో కారణంతోనూ వార్తల్లో నిలిచింది. అక్షయ్, రేఖ మధ్య అనుబంధం పెనవేసుకుంటోందనేదే ఆ కారణం. ఖిలాడీ కుమార్గా పేరుపొందిన అక్షయ్ ఆ టైమ్లో రవీనాతో డేటింగ్ చేస్తున్నాడు. ఆ ఇద్దరూ విడిపోవడానికి రేఖే కారణమంటూ విరివిగా ప్రచారంలోకి వచ్చింది.
అయితే ఆ తర్వాత కాలంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అక్షయ్, రేఖ మధ్య ఎలాంటి బంధం లేదని రవీనా చెప్పడం గమనార్హం. సినిమా కోసమే రేఖను అక్షయ్ సహిస్తూ వచ్చాడని ఆమె వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో అతను రేఖను తప్పించుకొని పారిపోయేవాడని కూడా తెలిపింది రవీనా. అక్షయ్ కోసం సెట్స్కు భోజనం తీసుకురావాలని రేఖ అనుకున్నప్పుడు ఆమెపై తనకు చాలా కోపం వచ్చిందని ఆమె చెప్పింది. ఆ టైమ్లో ఆ పరిస్థితిని ఎలా మేనేజ్ చేయాలో అతనికి బాగా తెలుసని పేర్కొంది రవీనా.
రవీనా తన వైఖరిని స్పష్టం చేశాక, రేఖతో అక్షయ్ ఎలాంటి బంధాన్ని కొనసాగించలేదనీ, ఆ ఇద్దరి మధ్య రొమాంటిక్ యాంగిల్ లాంటిదేమీ లేదనేది స్పష్టం. అయితే రవీనాతో అక్షయ్ అనుబంధం గురించి తెలిసినప్పటికీ 'ఖిలాడియోం కా ఖిలాడీ' షూటింగ్ కాలంలో అక్షయ్కు రేఖ సన్నిహితం కావాలని ప్రయత్నించారనేది ఓ వాస్తవంగా బాలీవుడ్లో చెప్పుకున్నారు. ఏదేమైనా రవీనాతో బ్రేకప్ తర్వాత ట్వింకిల్ ఖన్నాతో ప్రేమలో పడిన అక్షయ్.. ఆమెను వివాహమాడాడు. ఆ దంపతులు ఆరవ్, నితార అనే ఇద్దరు పిల్లలతో తమ సాంసారిక జీవితాన్ని హ్యాపీగా గడుపుతున్నారు.