విరాఫ్-సలోని పెళ్లి ఖర్చు అక్షరాలా రూ. 150!
on May 8, 2021
పాపులర్ హిందీ సీరియల్ 'నామ్కరణ్' ఫేమ్ నటుడు విరాఫ్ పటేల్ మే 6న తన చిరకాల ప్రియురాలు సలోని ఖన్నాను పెళ్లాడాడు. మొదట, ఈ జంట సందడిగా వివాహ వేడుక చేసుకోవాలని ప్లాన్ వేసుకున్నారు. అయితే, కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ భారతదేశాన్ని గట్టిగా పట్టుకోవడంతో, ముంబైలోని బాంద్రా కోర్టులో సింపుల్గా వివాహం చేసుకున్నారు. విరాఫ్, సలోని తల్లిదండ్రులు కూడా వారి వివాహానికి రాలేకపోయారు. ఎందుకంటే సాక్షులుగా ఇది వారి సన్నిహితులలో ముగ్గురికి మాత్రమే పరిమితం చేయబడింది. ఈ జంట సింపుల్గా చేసుకున్న తమ పెళ్లి ద్వారా ఆదా చేసిన డబ్బును కొవిడ్ 19 రిలీఫ్ కోసం విరాళంగా ఇవ్వనున్నారు.
హిందుస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాఫ్ పటేల్ మాట్లాడుతూ.. తాను, సలోని ఈ నెలలో ఒక గ్రాండ్ సెర్మనీతో వివాహం చేసుకోవాలనుకున్నామని, అయితే మహమ్మారి సెకండ్ వేవ్ తమను ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పాడు. కేసులు పెరుగుతూనే ఉండటంతో, తాము ప్లాన్ చేసుకున్న ప్రతిదాన్ని వదిలేసుకున్నామని తెలిపాడు. "చివరికి, మా తల్లిదండ్రులు, కుటుంబాలు కూడా వాక్సిన్ రెండో డోస్ ఇంకా వేసుకోనందున లేనందున ఇళ్ల దగ్గరే సురక్షితంగా ఉండమనీ, పెళ్లికి రావద్దనీ చెప్పవలసి వచ్చింది." అని విరాఫ్ చెప్పాడు. వారి సన్నిహితులు ముగ్గురు మాత్రమే ఈ వేడుకకు సాక్షులుగా నిలిచారు.
ఈ విషయంపై తమ కుటుంబాలు రెండూ నిరాశకు గురయ్యాయని, వాళ్ల గుండెలు పగిలిపోయాయని కూడా విరాఫ్ వెల్లడించాడు. అయినప్పటికీ, ఆ బాధను వారు చిరునవ్వుతో దాచారన్నాడు. సలోని తల్లి లేకపోవడంతో ఆమె పాత్రను పొరుగువారిలో ఒకరు పోషించారనీ, వివాహానంతర ఆచారాలకు ఆమె సహాయం చేశారని అతను చెప్పాడు. వారి కుటుంబం ఈ వేడుకను ఓ వీడియో కాల్ ద్వారా తిలకించింది.
కోవిడ్తో పోరాడుతున్న వ్యక్తులకు సహాయం చేయడానికి, వారికి సపోర్ట్గా నిలవడానికి ఈ జంట తమ పెళ్లి ద్వారా ఆదా చేసిన డబ్బును విరాళంగా ఇవ్వాలనుకుంటున్నారు. విరాఫ్ మాట్లాడుతూ, “నేను 150 రూపాయలతో పెళ్లి చేసుకున్నాను. మేము మ్యారేజ్ రిజిస్ట్రార్కు 100 రూపాయలు ఫీజుగా, 50 రూపాయలు ఫోటోకాపీలకు చెల్లించాం. నిజానికి సలోని, నేను మరీ భారీ ఖర్చుతో వివాహం చేసుకోవాలని అనుకోలేదు. ఏమైనప్పటికీ, మేం ఆదా చేసిన దానితో, మా సర్కిల్లలో, అంతకు మించి కూడా కొవిడ్తో పోరాడుతున్న వారి కోసం ఉపయోగిస్తాం. ఇది మా పెళ్లికి, మా కలయికకు మరింత అర్థాన్ని ఇస్తుంది." అని తెలిపాడు.