వేణుమాధవ్ ఓపెన్ ఛాలెంజ్
on Nov 1, 2016
మీడియాపై కమిడియన్ వేణుమాధవ్ సీరియస్ గా ఉన్నాడు. ఇటీవల ఆయనపై చాలా వదంతులే పుట్టాయి. వేణుమాధవ్కి చెప్పుకోలేని రోగాలున్నాయని ఓ దఫా పుకార్లు గుప్పుమన్నాయి. ఆ తరవాత ఆయన చనిపోయాడని టీవీల్లో స్క్రోరింగులు కూడా వేశారు. వీటిపై వేణు ఆనాడే ఫైర్ అయ్యాడు. ఇలాంటి అపవాదుల్ని కావాలని ప్రచారం చేస్తున్నవాళ్లని వదిలిపెట్టేది లేదని హెచ్చరించాడు. ఇప్పుడు అందుకు రంగం సిద్దం చేసుకొన్నాడు. ఇటీవల గవర్నర్ని కలసి జరిగిందంతా చెప్పుకొన్నాడు. తనపై పుకార్లు పుట్టించినవాళ్లపై ఫిర్యాదు చేశాడు. అంతేకాదు.. వాళ్ల నుంచి తనకు సెక్యురిటీ కావాలని కోరాడు కూడా. దీనిపై గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. బయటకు వచ్చిన వేణుమాధవ్ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకొన్నాడు. ఎవరైతే తనకు లేనిపోని రోగాలు అంటగట్టారో.. వాళ్లందరికీ ఛాలెంజ్ విసిరాడు. తాను మీడియా ముందు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి సిద్దమని.. వాళ్లు సిద్దమేనా అంటూ సవాల్ చేశాడు. అయితే వేణుమాధవ్ మాట్లాడుతూ మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలచివేసింది. ఇదంతా తెర వెనుక నుంచి ఎవరో కావాలని చేస్తున్న కుట్రలా కనిపిస్తోందని, అందుకే వేణుమాధవ్ ఇంత సీరియస్ గా ఉన్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వేణుమాధవ్ త్వరలోనే కేసీఆర్ని కలుస్తాడట. అక్కడైనా ఆయనకు సత్వర న్యాయం జరుగుతుందేమో చూడాలి.