మరోసారి లాయర్ గా వరలక్ష్మి!
on Oct 22, 2021
ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన తెలుగు చిత్రం `నాంది`లో లాయర్ ఆద్యగా అలరించారు నటి వరలక్ష్మి శరత్ కుమార్. కట్ చేస్తే.. త్వరలో ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ మరోమారు వకీల్ గా దర్శనమివ్వబోతున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. `సత్యం` ఫేమ్ సూర్య కిరణ్ దర్శకత్వంలో ఓ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ రూపొందుతోంది. `అరశి` అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో కోలీవుడ్ బాట పడుతున్నారాయన. మహిళా సాధికారత అనే అంశం చుట్టూ అల్లుకున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ లాయర్ వేషంలో కనిపించనున్నారని సమాచారం. ఇటీవలే పట్టాలెక్కిన ఈ సినిమాలో లైంగిక వేధింపుల కేసులో తప్పు చేసిన వారికి అనుకూలంగా వాదించే వకీల్ గా వరలక్ష్మి దర్శనమివ్వనున్నారట. అలాగని నెగటివ్ షేడ్స్ ఉండవని.. ఈ పాత్రలో ఉండే ట్విస్టే సినిమాకి కీలకమని కోలీవుడ్ బజ్. మరి.. ఫన్ అండ్ సీరియస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ కోర్ట్ డ్రామా వరలక్ష్మికి ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తుందో చూడాలి.
కార్తిక్ రాజ్, సిద్ధార్ధ్ రాయ్, సంతాన భారతి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న `అరశి`ని ఎ.ఆర్.కె. రాజారాజా, వరలక్ష్మి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. విపిన్ సిద్ధార్ధ్ సంగీతమందిస్తున్నాడు.