తారక్, వంశీ పైడిపల్లి కాంబోలో మరో మూవీ!
on May 22, 2022
మే 20న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఫ్యాన్స్ ట్విట్టర్ లో తారక్ పేరు మారుమోగేలా చేయడమే కాకుండా.. వివిధ ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మరోవైపు సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విషెస్ చెప్పారు. అయితే డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఫ్యామిలీ మాత్రం తారక్ బర్త్ డే వేడుకల్లో ప్రత్యక్షంగా పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు తారక్- వంశీ కాంబినేషన్ లో మరో మూవీ రానుందంటూ చర్చలు కూడా మొదలయ్యాయి.
టాలీవుడ్ స్టార్స్ తారక్, మహేష్ బాబుతో వంశీ చాలా సన్నిహితంగా ఉంటాడు. ముఖ్యంగా తారక్ పై ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు. 'మున్నా'తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ప్లాప్ అందుకున్నప్పటికీ.. తారక్ తనకి 'బృందావనం' ఛాన్స్ ఇచ్చి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా నిలబెట్టాడని వంశీ చెబుతుంటాడు. అంతేకాదు 'బృందావనం' తర్వాత తాను డైరెక్ట్ చేసిన 'ఎవడు', 'ఊపిరి' సినిమాల కథలను కూడా మొదట తారక్ కే చెప్పాడు. అలా తారక్ తో ఎంతో సన్నిహితంగా ఉండే వంశీ.. 'మహర్షి' టైం నుంచి మహేష్ తో ఎక్కువగా కనిపించాడు. అంతేకాదు 'మహర్షి' తర్వాత వీళ్ళ కాంబోలో మరో సినిమా వస్తుందని ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. ఈ క్రమంలో తారక్ బర్త్ డే పార్టీలో వంశీ కనిపించడంతో.. బృందావనం కాంబో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
'ఆర్ఆర్ఆర్'తో సంచలన విజయాన్ని అందుకున్న తారక్.. కొరటాల శివ డైరెక్షన్ లో 'NTR30', ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'NTR31' చేస్తున్నాడు. ఆ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడని టాక్. మరోవైపు వంశీ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ విజయ్ తో బైలింగువల్ మూవీ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తయ్యాక ఈ కాంబోలో మూవీ వస్తుందేమో చూడాలి.