త్రివిక్రమ్ నన్ను 'లేడీ పవన్ కల్యాణ్' అని పిలుస్తారు!
on Nov 30, 2021
సౌత్ లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ నిర్మాతగానూ మారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆమె నటిస్తూ నిర్మించిన చిత్రం 'స్కైలాబ్'. ఈ మూవీ డిసెంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన ఆమె పలు విషయాలను పంచుకుంది. తాను డబ్బు కోసం నిర్మాతగా మారలేదని, కథ బాగా నచ్చడంతోనే కో-ప్రొడ్యూసర్ గా మారానని తెలిపింది. భవిష్యత్తులో కూడా మంచి కాన్సెప్ట్స్ తో ఎవరైనా వస్తే.. నిర్మాతగా చిన్న బడ్జెట్ సినిమాలు చేయాలనుకుంటున్నానని చెప్పింది. ఈ సందర్భంగా భీమ్లా నాయక్ సినిమా గురించి కూడా ఆసక్తికర విషయాలను తెలిపింది.
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధానపాత్రల్లో సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'భీమ్లా నాయక్'. ఈ సినిమాలో పవన్ కి జోడీగా నిత్యా మీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీలో ఛాన్స్ ఎలా వచ్చింది? పవన్ తో కలిసి నటించడం ఎలా ఉంది? వంటి విషయాలను నిత్యామీనన్ తన రీసెంట్ ఇంటర్వ్యూలో పంచుకుంది.
"త్రివిక్రమ్ ఫోన్ చేసి 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ లో నటించాలని అడిగారు. ఆయన నా గురించి పవన్ కల్యాణ్ దగ్గర 'లేడీ పవన్ కల్యాణ్ ను తీసుకుంటున్నాం.. మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ గా సెట్టవుతుంది' అని చెప్పారట. షూటింగ్ టైంలో పవన్ కల్యాణ్ ముందే త్రివిక్రమ్ నన్ను 'లేడీ పవన్ కల్యాణ్' అంటూ సరదాగా పిలుస్తారు. పవన్ తో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఆయనెప్పుడూ కూల్ గా, నవ్వుతూ కనిపిస్తారు. నేను నిర్మాతగా సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు ఆయన హ్యాపీగా ఫీలయ్యారు." అంటూ చెప్పుకొచ్చింది నిత్యామీనన్.