ఫ్లాష్ బ్యాక్: అక్కినేనికి కోపమొస్తే...?
on Jul 31, 2017
మనసు బాధ పడితే... ఆ బాధ జీవితాంతం గుర్తుండి పోతుంది. దానికి ఎవరూ అతీతులు కారు. ఒక్కోసారి మహామహులకే తొలినాళ్లలో చేదు అనుభవాలు ఎదురవుతుంటాయ్. అవి వారు ఎదిగాక కూడా మరచిపోరు. అలాంటి సంఘటన అక్కినేని నాగేశ్వరరావుకి ఒకటుంది. దాని ఇప్పుడు గుర్తచేసుకుందాం.
76ఏళ్ల క్రితం ఆయన తొలి సినిమా ‘ధర్మపత్ని’షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన ఇది . అప్పుడు ఆయన వయసు పదిహేడేళ్లు. నాటక రంగంలో స్త్రీ పాత్ర పోషిస్తూ ఉన్న అక్కినేనికి... అనుకోకుండా దక్కిన అవకాశం ‘ధర్మపత్ని’. అందులో ఆయనది చిన్న పాత్ర. అక్కినేని నాటకరంగం నుంచి వచ్చిన వాడు అవ్వడం చేత.. బాగా పాడేవారు. లొకేషన్లో ఉన్నవారంతా.. ఆయన్ను దగ్గర కూర్చోబెట్టుకొని పద్యాలు పాడించుకునేవారు. అలా దర్శకుడు పి.పుల్లయ్య కూడా గ్యాప్ దొరికినప్పుడల్లా..ఆయనతో ఓ పద్యం పాడించుకునేవారు.
ఇలా చాలారోజులు సాగింది. షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంటోంది. ఓ సారి షూటింగ్ గ్యాప్ లో పుల్లయ్యగారు అక్కినేనిని పిలిపించుకొని‘ఓ మంచి పద్యం అందుకోరా!’ అని అడిగారు. పెద్దాయన అడిగారు కదా అని.. అక్కినేని పద్యం ఎత్తుకున్నారు. అయితే...
ఆ పద్యం అప్పటికే చాలాసార్లు పుల్లయ్యగారి ముందు పాడిన పద్యం. దాంతో... చిరాకులో ఉన్న పుల్లయ్య.... ‘పదే పదే అదే పద్యం పాడతావేరా **********’ అంటూ ఓ అనకూడని బూతు మాట అన్నారట. దాంతో చిన్నవాడైన అక్కినేని మనసు చివుక్కుమంది. పక్కకెళ్లి ఒక్కడే కన్నీరు పెట్టుకున్నారట.
అది జరిగి పధ్నాలుగేళ్లు గడిచింది. అక్కినేని సూపర్ స్టార్ అయ్యారు. ఆ టైమ్ లోనే పుల్లయ్యగారు ఓ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. సినిమా పేరు ‘అర్థాంగి’. అందులో మెయిన్ హీరో పాత్రకు ఎన్టీయార్ అనుకున్నారు. ఎన్టీయార్ తమ్ముడి పాత్ర హీరోకి సమానమైన పాత్ర. పైగా యాంటీ షేడ్స్ ఉన్న పాత్ర. ఆ పాత్రను అక్కినేనితో చేయించాలని పుల్లయ్య వెళ్లి కలిశారు. విషయం చెప్పారు. దాంతో అక్కినేని తడుముకోకుండా... ఆయన గతంలో అన్న బూతు మాటను గుర్తు చేస్తూ ‘మీతో పనిచేస్తే... మళ్లీ అలాంటి మాటలు పడాల్సివస్తుంది. అందుకే మీలాంటి వారికి దూరంగా ఉంటేనే కరెక్ట్’ అన్నారట.
అంతే.. పుల్లయ్యకి ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తొచ్చి షాకైపోయారట. ‘ఓరి నీ దుంపదెగ.. అది ఇంకా గుర్తుపెట్టుకున్నావా. భలేవాడివేనయ్యా... అప్పుడంటే చిన్నపిల్లాడివి. ఏదో చనువు కొద్దీ అన్నాను. అవసరమైతే ఇప్పడు క్షమాపణ వేడుకుంటా’ అన్నారట పుల్లయ్య.
దాంతో అక్కినేని శాంతించి, ‘ఇందులో హీరో వేషమైతే చేస్తా. ఆ తమ్ముడి పాత్రకు జగ్గయ్యను తీసుకోండి’ అని పుల్లయ్యకు సలహా ఇచ్చారట. ఇక చేసేది లేక... హీరో పాత్రకు ముందు అనుకున్న ఎన్టీయార్ ని పక్కన పెట్టి, అక్కినేనితో చేశారు పుల్లయ్య.
దీన్ని బట్టి ఆయన మనసు బాధ పడితే... ఎలా గుర్తుపెట్టుకుంటారో అర్థం చేసుకోవచ్చు. ఎంతైనా... మనసు కథల్లో ఎక్కువ నటించిన కథానాయకుడు కాదా!