ప్రముఖ అగ్ర నిర్మాత మహేంద్ర మృతి..శ్రీహరి ని హీరోగా పరిచయం చేసారు
on Jun 11, 2025
రియల్ స్టార్ శ్రీహరి(Srihari)హీరోగా పరిచయమైన చిత్రం పోలీస్(Police). ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించిన ఏ ఏ ఆర్ట్స్ బ్యానర్ పై కె. మహేంద్ర(K. Mahendra)నిర్మించాడు. శ్రీహరి తదుపరి చిత్రం 'దేవా'ని కూడా మహేంద్ర నే నిర్మించాడు. డెబ్భై తొమ్మిది సంవత్సరాల వయసు గల మహేంద్ర గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతున్నారు.
ఈ క్రమంలో నిన్న రాత్రి గుంటూరు(Guntur)లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించారు. చెన్నై(Chennai)లో ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమయ్యింది. గీతా ఆర్ట్స్ పిక్చర్స్, ఎఎ ఆర్ట్స్ బ్యానర్ పై సుమారు యాభై చిత్రాల వరకు నిర్మించారు. ప్రముఖ నటుడు, నిర్మాత డాక్టర్ మాదాల రవికి మహేంద్ర స్వయానా మావయ్య. వీరసింహారెడ్డి ని తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని ని దర్శకత్వ శాఖలో పరిచయం చేసింది మహేంద్ర నే. నేడు గుంటూరులోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబసభ్యులు తెలిపారు.
తొలుత దర్శకత్వ శాఖలో శిక్షణ పొందిన మహేంద్ర, ఆ తర్వాత నిర్మాతగా మారారు. 1977 లో మురళిమోహన్, జయచిత్ర జంటగా వచ్చిన 'ప్రేమించి పెళ్ళి చేసుకో' తన తొలి చిత్రం. ఆ తర్వాత 'ఏది పుణ్యం? ఏది పాపం?', 'ఆరని మంటలు', 'తోడు దొంగలు', 'బందిపోటు రుద్రమ్మ', 'ఎదురలేని మొనగాడు', 'ఢాకూరాణి', ప్రచండ భైరవి', 'కనకదుర్గ వ్రతమహాత్మ్యం' వంటి పలు చిత్రాలని నిర్మించారు. చిత్ర పరిశ్రమలోని పలు శాఖల్లోను పని చేసిన మహేంద్ర పూర్తి పేరు కావూరి మహేంద్ర. 1946 ఫిబ్రవరి 4న గుడివాడ తాలూకా దోసపాడు గ్రామంలో జన్మించారు. కొంత కాలం క్రితం మహేంద్ర తనయుడు జీతు కూడా మరణించడం జరిగింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
