రామానాయుడు నిర్మించిన `తాజ్ మహల్`కి 27 ఏళ్ళు!
on May 25, 2022
సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత, మూవీ మొఘల్ డి. రామానాయుడు పలు జనరంజక ప్రేమకథా చిత్రాలను నిర్మించారు. వాటిలో `తాజ్ మహల్` ఒకటి. శ్రీకాంత్ కి కథానాయకుడిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చిన ఈ సినిమాతోనే ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ అరంగేట్రం చేయడం విశేషం. మ్యూజికల్ హిట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ దర్శకుడు ముప్పలనేని శివ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామాలో శ్రీకాంత్ కి జంటగా మోనికా బేడి, సంఘవి సందడి చేయగా.. శ్రీహరి, రంగనాథ్, కోట శ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్, బ్రహ్మానందం, బాబూ మోహన్, సుధ, సుధాకర్, మల్లికార్జున రావు, అచ్యుత్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
ఎం. ఎం. శ్రీలేఖ స్వరకల్పనలో రూపొందిన పాటల్లో ``మంచుకొండల్లోని చంద్రమా`` ఎవర్ గ్రీన్ మెలోడీగా నిలవగా.. ``పెళ్ళి పెళ్ళంటూ``, ``సాగిపోయే నీలి మేఘం``, ``ఝుమ్ ఝుమ్ అంటూ``, ``ఓ కల కన్నది``, ``చిక్ లుక్ చిక్ లుక్`` అంటూ మొదలయ్యే గీతాలు కూడా రంజింపజేశాయి. 1995 మే 25న విడుదలై మంచి విజయం సాధించిన `తాజ్ మహల్`.. నేటితో 27 వసంతాలు పూర్తిచేసుకుంది.