'పహిల్వాన్' మరో 'కె.జి.ఎఫ్.' అవుతుందా?
on Sep 7, 2019
కన్నడ సినిమాలు తెలుగులో ఆడటం బహు తక్కువ. ఒకప్పుడు ఉపేంద్ర సినిమాలు తెలుగులో డబ్ అయ్యి హిట్టయ్యాయి. ఆ తర్వాత చాలా కాలం కన్నడ సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ని తెలుగువాళ్లు ఆదరించలేదు. ఆ లోటును యశ్ హీరోగా నటించిన 'కె.జి.ఎఫ్.' తీర్చింది. ఆ సినిమాకు తెలుగు ప్రేక్షకులు అనూహ్య విజయాన్ని అందించారు. హీరో యశ్.. మన సినీ ప్రేమికుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు.
ఆ మూవీని తెలుగువాళ్ల ముందుకు తెచ్చిన వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి.. ఇప్పుడు మరో కన్నడ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా.. మనకు సుపరిచితుడైన సుదీప్ టైటిల్ రోల్ పోషించిన 'పహిల్వాన్'. ఇందులో సుదీప్ రెజ్లర్గా నటించాడు. ఎస్. కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సుదీప్ గురువుగా బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సునీల్ శెట్టి నటించగా, హీరోయిన్గా 'దేవదాస్'లో నాగార్జున జోడీగా కనిపించిన ఆకాంక్షా సింగ్ నటించింది.
యశ్ తరహాలో పాన్ ఇండియా స్టార్గా మారాలని సుదీప్ భావిస్తున్నాడు. అందుకే ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్ చేసి, ఈ నెల 12న ఒరిజినల్ వెర్షన్తో పాటే రిలీజ్ చేస్తున్నారు. రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన 'రక్తచరిత్ర' సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుదీప్ను, రాజమౌళి సినిమా 'ఈగ' సూపర్ పాపులర్ చేసింది. ఆ మూవీలో విలన్గా అతడు చేసిన అభినయానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజమౌళే రూపొందించిన 'బాహుబలి'లో ఒక అతిథి పాత్రలో కనిపించిన సుదీప్, త్వరలో రానున్న చిరంజీవి సినిమా 'సైరా.. నరసింహారెడ్డి'లో కీలకమైన అవుకురాజు కేరెక్టర్లో నటించాడు.
ఈ నేపథ్యంలో తెలుగులో తనకంటూ మార్కెట్ సృష్టించుకొనే ప్రయత్నం చేస్తున్నాడు సుదీప్. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు హాజరయ్యాడు. అదే ఈవెంట్లో గెస్ట్గా పాల్గొన్న వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పి.వి. సింధుతో సెల్ఫీ దిగి హల్చల్ చేశాడు. 'కె.జి.ఎఫ్.' చూపిన బాటలో 'పహిల్వాన్'గా అతడు తెలుగువాళ్లను ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.