విమర్శలపై రాజమౌళి రెస్పాన్స్.. కథ చెప్పడం మానేయాలా?
on Oct 25, 2020
నిజాం పాలకులకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీమ్ను ముస్లింగా చూపించడమేమిటని 'ఆర్ఆర్ఆర్' సినిమా నుండి ఎన్టీఆర్ టీజర్ విడుదలైన తరవాత విమర్శలు వచ్చాయి. వీటిని రాజమౌళి ముందుగానే ఊహించాడని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరోవైపు యూట్యూబ్ లో కూడా 'ఆర్ఆర్ఆర్' సినిమా తొలి ప్రెస్ మీట్ సందర్భంగా రాజమౌళి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.
క్రిస్టియన్లు అయిన బ్రిటీషర్ల పాలనలో అల్లూరి సీతారామరాజు ఉన్నారు. పోరాటం చేశారు. నైజాంలోని ముస్లిం పాలనలో కొమరం భీమ్ ఉన్నారు. పోరాటం చేశారు. బ్రిటీషర్లు, నిజాం రాజులు బయట నుండి వచ్చినవాళ్లు. అల్లూరి, కొమరం హిందువులు. మీరు కథ అనుకున్నప్పుడు అటువంటిది ఉండకపోవచ్చు కానీ విడుదల సమయానికి మతపరమైన వివాదాలు వస్తే పరిస్థితి ఏమిటి? అని రాజమౌళికి ఓ ప్రశ్న ఎదురైంది.
"ఎక్కడి నుండి ఎక్కడికైనా లింక్ వేయవచ్చు అన్నమాట. ఓకే... కొమరం భీమ్ నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. నిజాం ఇస్లాంకి సంబంధించినవాళ్లు. బ్రిటీషర్లపై అల్లూరి పోరాటం చేశాడు. బ్రిటీషర్లు క్రిస్టియన్లు. అందుకని, కథ చెప్పడం మానేయాలా? ఇటువంటి విమర్శలు వస్తాయి. ఊహించని విధంగా ఏదో ఒకటి వస్తుంది. దాని గురించి నేను ఆలోచించను. మనం సిన్సియర్ గా కథ చెబుతున్నామా? లేదా? అనేది ఒక్కటే పాయింట్" అని రాజమౌళి గతంలో చెప్పారు. ఆ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వివాదాలు రావడం సహజమైనదని ఆయన అన్నారు. కృష్ణగారు 'అల్లూరి', రాఘవేంద్రరావుగారు 'అన్నమయ్య' తీసినప్పుడు వివాదాలు వచ్చాయని, వివాదాల కోసం సినిమాలు తీయడం మానకూడదని ఆయన అన్నారు.
Also Read