పవన్ కల్యాణ్ బాటలో జక్కన్న!
on Jul 15, 2020
షూటింగ్ లేకపోయినా, రాజకీయ కార్యకలాపాలు లేకపోయినా సంగారెడ్డిలో ఉన్న తన ఫామ్హౌస్కు వెళ్లి గడుపుతుంటారు పవర్స్టార్ పవన్ కల్యాణ్. ఓవైపు అక్కడ ప్రకృతి ఒడిలో సేదతీరుతూనే, మరోవైపు పాడిపని, తోటపని కూడా చేస్తుంటారు. చూస్తుంటే, ఆ బాటలోనే టాప్ డైరెక్టర్ యస్.యస్. రాజమౌళి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. నల్గొండ జిల్లా నార్కేట్పల్లి దగ్గరున్న ఎదురూలు గ్రామంలో ఆయన ఓ ఫామ్హౌస్ను నిర్మించుకున్నారు. ఇప్పుడప్పుడే 'ఆర్ ఆర్ ఆర్' మూవీ షూటింగ్ పునరుద్ధరించే అవకాశాలు కనిపించకపోతుండటంతో ప్రస్తుతం అక్కడే కాలక్షేపం చేస్తున్నారు.
వాస్తవానికి 'ఆర్ ఆర్ ఆర్' సినిమా 2021 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. షూటింగ్లు నిలిచిపోవడంతో 2021 వేసవికి విడుదల వాయిదా పడింది. జూలై 30కి వాయిదా పడినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు విశ్లేషకులు. అంటే మొట్టమొదట అనౌన్స్ చేసిన 2020 జూలై 30కి బదులు 2021 జూలై 30కి సినిమా వస్తుందన్న మాట. అంటే సరిగ్గా ఏడాది పాటు విడుదల తేదీ వాయిదా పడినట్లవుతుంది. ఈ నేపథ్యంలో 'ఆర్ ఆర్ ఆర్' తర్వాత మహేశ్తో తను తీయబోయే సినిమా స్క్రిప్ట్ మీద పనిచేస్తున్నాడు జక్కన్న. "మహేశ్ బాబు ఫిల్మ్ కోసం ఓ సబ్జెక్ట్ను ప్రిపేర్ చేయడానికి మా నాన్నగారితో కలిసి కథా చర్చల్లో పాల్గొంటున్నాను" అని ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపాడు. మహేశ్తో ఆయన తీసే సినిమా బహుశా 2021 చివరలో మొదలు కావచ్చనేది ఓ అంచనా. దుర్గా ఆర్ట్స్ అధినేత డాక్టర్ కె.ఎల్. నారాయణ ఈ సినిమాని నిర్మించనున్నారు.