శ్రీదేవి జర్నీ: సూపర్స్టార్ నుంచి సూపర్ మామ్ దాకా!
on Aug 13, 2020
ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినిమా జీవితంలో శ్రీదేవి అనేకానేక వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అయినప్పటికీ ఆమె అమితంగా ఇష్టపడింది తల్లి కావడాన్నే. కెరీర్ అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కాలంలోనే నటనను వదిలిపెట్టి పూర్తి స్థాయిలో తల్లి పాత్రలో ఒదిగిపోయారు. సోషల్ మీడియాలో శ్రీదేవిని ఫాలో అయినవాళ్లకు, ఆమె ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నిండా ఇద్దరు కూతుళ్లు జాన్వీ, ఖుషి ఫొటోలు దర్శనమిస్తుంటాయి.
నటనకు బ్రేక్ చెప్పడం వల్ల తన పిల్లలతో ప్రతి క్షణం గడపడానికి ఆమెకు అవకాశం లభించింది. ఏకంగా పదిహేను సంవత్సరాల పాటు సినిమాలకు, నటనకు దూరంగా ఉండాననే అసంతృప్తి ఆమెకు ఏనాడూ కలగకపోవడానికి కారణం.. తన కూతుళ్లతో గడపడాన్ని ఆమె బాగా ఎంజాయ్ చేయడమే. పిల్లల విషయంలో ఆమె చాలా ప్రొటెక్టివ్ అనేది ఎంత నిజమో, వాళ్లను అమితంగా ప్రేమించిందన్నది అంతే నిజం. వాళ్లపై తన ప్రేమను ప్రదర్శించడానికి గానీ, వాళ్లను మెచ్చుకోవడానికి గానీ ఆమె ఏనాడూ సంకోచించలేదు. ఆ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ తెలియజేస్తుంది.
పెద్ద కుమార్తె జాన్వి నటనను కెరీర్గా ఎంచుకుంటానని చెప్పినప్పుడు ఓ తల్లిగా శ్రీదేవి కొంత నెర్వస్గా ఫీలయ్యారు కానీ ఆ వెంటనే సపోర్ట్ చేశారు. బాగా కష్టపడమనీ, సక్సెస్ లేదా ఫెయిల్యూర్కు ప్రభావితం కావద్దనీ కూతురికి ఆమె సూచించారు. నటన నుంచి మాతృత్వం దాకా తను నమ్మినదానికి పూర్తిగా కట్టుబడి ఉండటం ఆమెలోని గొప్ప గుణం. పిల్లల కోసం నటనను వదిలి పెట్టిన ఆమె, 'ఇంగ్లీష్ వింగ్లీష్' కోసం మళ్లీ సినిమా సెట్పై అడుగుపెట్టినప్పుడు, తన ఫోకస్నంతా నటనపైనే పెట్టారు.
తను నటించిన చివరి సినిమా 'మామ్' ప్రమోషన్లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఇద్దరు పిల్లల తల్లిని కావడం అనేది మామ్ క్యారెక్టర్ను పోషించడానికి బాగా ఉపయోగపడిందని చెప్పారు శ్రీదేవి. ఆ సినిమా సెట్స్పై ఉన్నంత సేపూ తన పనికి వంద శాతం న్యాయం చెయ్యాలనే ఉద్దేశంతో మధ్యలో ఎప్పుడూ భర్త బోనీ కపూర్తో కానీ, కూతుళ్లతో కానీ కనీసం ఫోన్లో కూడా ఆమె మాట్లాడలేదంటే.. అది ఆమెలోని అంకితభావానికి నిదర్శనం కాక మరేమిటి!
జాన్వీ కపూర్కు అతి పెద్ద సపోర్టర్, ఆమెను అందరికంటే అమితంగా ప్రేమించిన తల్లి, తను నటించిన మొదటి సినిమా 'ధడ్కన్' విడుదల కాకముందే అత్యంత విషాదకర స్థితిలో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. శ్రీదేవిని మనం ఎంతగా మిస్సవుతున్నామో ఆమె అభిమానులుగా మనకు తెలుసు. కానీ ఆమె లెగసీ మాత్రం ఎప్పటికీ జీవించే ఉంటుంది. సునాయాసంగా తను పోషించిన పాత్రల ద్వారా, పాటల్లో తను చేసిన అపురూప విన్యాసాల ద్వారా ఆమె మన హృదయ తంత్రులను ఎప్పటికీ మీటుతూనే ఉంటుంది.
(ఆగస్ట్ 13 శ్రీదేవి జయంతి)