మాది బలమైన బంధం.. విడిపోయేదేలే!
on Jun 29, 2022
భార్యాభర్తలైన సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర విడిపోతున్నారంటూ కొద్ది రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తలపై ఇప్పుడు హేమచంద్ర మౌనాన్ని వీడారు. "మూర్ఖులు ఎప్పుడూ వాళ్ళ టైంని ఇలా వృధా చేసుకుంటారు" అనే కాప్షన్ తో ఒక రివర్స్ ఇమేజ్ ని బ్లాక్ బ్యాగ్రౌండ్తో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. "అనవసరమైన, అసంబద్ధమైన, తెలివితక్కువ సమాచారం నేను పాడిన పాటల కంటే చాలా వేగంగా వ్యాపిస్తుంది" అనే అర్థం వచ్చేలా ఘాటుగానే స్పందించారు.
ఇక శ్రావణ భార్గవి కూడా ఈ విషయంపై తన స్పందన తెలిపారు. "కొద్ది రోజులుగా మాపై వస్తున్న వార్తలతో నా యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతున్నారు చాలామంది. దీని కారణంగా వాచ్ అవర్స్ బాగా పెరిగాయి. ఇన్స్టాగ్రామ్ పేజీలో ఫాలోయర్స్ కూడా చాలా మంది పెరిగారు.. సాధారణంగా నేను సంపాదించే దాని కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా సంపాదిస్తున్నాను. ఏదేమైనా నిజంగా ఇది ఒక శుభసూచకం" అంటూ పోస్ట్ చేశారు.
హేమచంద్ర, శ్రావణ భార్గవి మధ్య ఏమంత పొసగట్లేదనే గాలి వార్తలు ఇప్పటివరకు బాగా వీచాయి. ఐతే ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ కలిసి తమ స్పందన చెప్పేసరికి ఫాన్స్ కూడా వాళ్లకు చాలా సపోర్ట్ చేస్తున్నారు.
2013 ఫిబ్రవరి 14న శ్రావణభార్గవి, హేమచంద్ర వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు. వీళ్లకు శిఖరచంద్రిక అనే పాప కూడా ఉంది. ఇటీవల శ్రీరామచంద్ర హోస్ట్ చేసిన ఒక తెలుగు ఇండియన్ ఐడల్ షోలో ఒక ఎపిసోడ్ లో ఈ జోడి కనిపించింది. అలాగే శ్రీరామచంద్ర లేని టైములో శ్రావణ భార్గవి టు ఎపిసోడ్స్ ని హోస్ట్ చేసింది. గతంలో ప్రసారమైన ఫేమస్ సింగింగ్ షో "బోల్ బేబీ బోల్" షోకి హోస్ట్ గా కూడా చేశారు.