ఆమె గొంతుతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది
on Dec 19, 2019
రనీనా రెడ్డి.. అంటే చాలా తక్కువ మంది గుర్తుపట్టొచ్చు. అదే 'సుర్రు సూపర్.. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' వంటి పాటలు పడిన అమ్మడు అని చెప్పండి.. వెంటనే గుర్తుపట్టేస్తారు. మన గోల్ మీద మనకి క్లారిటీ, కాన్ఫిడెన్స్ ఉంటే.. ఎప్పటికైనా సక్సెస్ అవుతామని చెప్పడానికి రనీనా రెడ్డిని ఎగ్జామ్పుల్ గా తీసుకోవచ్చు. సింగర్ అవ్వాలని చిన్నప్పుడే గోల్ పెట్టుకుంది. సింగర్ అవుతానన్న కాన్ఫిడెన్స్ తో.. ఇంటర్ తరువాత చదువుకి ఫుల్ స్టాప్ పెట్టి మరీ.. సింగర్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. కట్ చేస్తే.. ఈ దశాబ్ద కాలంలో.. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం ఇలా పలు భాషల్లో వందకి పైగా పాటలు పాడి.. పలు అవార్డులు సైతం గెలుచుకుంది.
తెలుగులో ఎన్నో పాటలకు.. రనీనా రెడ్డి తన గొంతుతో.. మరింత కళ తీసుకొచ్చింది. తెలుగులో రనీనా పాడిన మొదటి సాంగ్ 'యు&ఐ' మూవీలోని 'డి ఫర్ డాన్స్' అయినప్పటికీ.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన 'కరెంట్' సినిమాలోని 'రెక్కలు తొడిగిన పక్షల్లే' సాంగ్ ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది. ఇక అక్కడి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒకవైపు తమిళ్ లో బిజీబిజీగా పాటలు పాడుతూనే మరోవైపు తెలుగులోనూ అలరించింది. జులాయిలో 'మీ ఇంటికి ముందర గేటు'.. బాద్షాలో 'బంతి పూల జానకి'.. లౌక్యంలో 'సుర్రు సూపర్'.. ఖైదీ నెంబర్ 150 లో 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' ఇలా ఎన్నో హిట్ సాంగ్స్ తో అలరించింది.
ఎందరో మ్యూజిక్ డైరెక్టర్స్ కంపొజిషన్ లో పాడినప్పటికీ.. దేవిశ్రీ కంపొజిషన్ లో పాడిన పాటలు రనీనాకు మరింత పేరు తీసుకొచ్చాయి. ఓ రకంగా వీరిద్దరిది హిట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. 2008 లో విడుదలైన కరెంట్ నుండి త్వరలో విడుదల కానున్న సరిలేరు నీకెవ్వరూ వరకు చూసుకుంటే.. ఎవడులో 'పింపుల్ డింపుల్'.. సారొచ్చారులో 'జగ జగ జగదేకవీర'.. ఖైదీ నెంబర్ 150 లో 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' .. జై లవకుశలో 'ట్రింగ్ ట్రింగ్'.. ఇలా ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నాయి. అంతెందుకు ఇటీవల విడుదలైన సరిలేరు నీకెవ్వరూలోని 'మైండ్ బ్లాక్' సాంగ్ కూడా యూత్ ని బాగా అలరిస్తోంది. ముఖ్యంగా ఈ సాంగ్ రనీనా పాడిన స్టైల్ కి యూత్ ఫిదా అయిపోయారు. మొత్తానికి సింగర్ అవ్వాలని గోల్ పెట్టుకున్న రనీనా.. అనుకున్నట్టుగానే సింగర్ అయ్యి.. తన సాంగ్స్ తో మైండ్ బ్లాక్ చేస్తోంది.