సింగింగ్ లెజెండ్ ఎస్పీబీ ఇకలేరు.. యావత్ దేశం కన్నీరుమున్నీరు!
on Sep 25, 2020
లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అలియాస్ బాలు ఇకలేరు. దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు తన గాన ప్రవాహంలో మనల్ని ఓలలాడించిన ఆ గానగంధర్వుడు ఇక సెలవంటూ మనల్ని వీడి వెళ్లిపోయారు. అవిశ్రాంతంగా, అలుపనేది లేకుండా నలభై వేలకు పైగా పాటలు పాడిన ఆ మహాగాయకుడు ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి శాశ్వతంగా కన్నుమూశారు. తన జీవితంలో ఎవరికీ తలవంచని ఆయన యాభై రోజులుగా కరోనా మహమ్మారితో పోరాడుతూ శుక్రవారం దానికి తలవొగ్గారు. బాలు లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక అశేష అభిమానులు తల్లడిల్లుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆయన మృతితో యావత్ సంగీత ప్రపంచం చిన్నబోయింది. తెలుగు సినీ సంగత రంగంలో ఒక శకం ముగిసింది. ఒక ధ్రువతార నింగికెగసింది. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆయనకు భార్య సావిత్రి, కుమారుడు చరణ్, కుమార్తె పల్లవి ఉన్నారు.
బాలు కొవిడ్ 19 పాజిటివ్ అని తేలి ఎంజీఎం హాస్పిటల్లో చేరిన కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందనే వార్తలు రావడంతో ఆయన ఆరోగ్యం కుదుటపడాలని ఆశిస్తూ టాలీవుడ్లోని సంగీతకారులు, కోలీవుడ్ వర్గాలు సామూహిక ప్రార్థనలు చేయడం ఒక అసాధారణ విషయం. ఒక కళాకారుడికి సంబంధించి ఇలాంటి ఘట్టం ఇదివరకు మనం చూడలేదు. అంతేకాదు, ఇళయరాజా, రజనీకాంత్, కమల్హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్బాబు లాంటి దిగ్గజాలు సహా వందలాది మంది సెలబ్రిటీలు ఆయన క్షేమంగా హాస్పిటల్ నుంచి బయటకు రావాలంటూ ప్రకటనలు జారీచేయడం, ఆయనతో తమ అనుబంధం పంచుకోవడం కూడా బాలు మహోన్నత స్థాయిని తెలియజేసే విషయం.
బాలు కుమారుడు చరణ్ ఎప్పటికప్పుడు తండ్రి ఆరోగ్య స్థితిగతుల గురించి పంచుకుంటూ రావడం, కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్యం మెరుగవుతూ వస్తోందనీ, వ్యాయామం కూడా చేస్తున్నారని తెలపడంతో అశేష అభిమానులు ఎంతో సంబరపడ్డారు. ఆయన మళ్లీ మనముందుకు వచ్చి, పాటలు పాడతారని ఆశలు పెట్టుకున్నారు. అలాంటిది హఠాత్తుగా ఆయన కొన ఊపిరితో మృత్యువుతో యుద్ధం చేస్తున్నారని తెలియడంతో గుండెలు ఉగ్గబట్టుకొని ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందారు. చివరకు తండ్రి కన్నుమూశారనే వార్తను కన్నీటి పర్యంతమవుతూ చరణ్ స్వయంగా చెప్పడంతో వారి గుండెలు బద్దలయ్యాయి.
అసాధారణ ప్రజ్ఞావంతునిగా, అనితరసాధ్యునిగా సంగీత రంగంలో రాణించిన బాలసుబ్రహ్మణ్యం పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర 11 భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడారు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుచుకుంటారు. ఆయన నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో 1946 జూన్ 4న జన్మించారు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ పాల్గొంటూ బహుమతులు సంపాదించారు.
1966 లో ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం నిర్మించిన 'శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న' చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. 'శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న' చిత్రానికి ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకులు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని ఆయన పేరే పెట్టుకున్నారు బాలు. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడారు బాలు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాదుర్యాన్ని గమనించి చేసే ఉచ్చారణ ఆయన పాటను పండిత పామరులకు చేరువ చేసింది. 'శంకరాభరణం', 'సాగరసంగమం' లాంటి తెలుగు చిత్రాలే కాకుండా 'ఏక్ దూజే కేలియే' లాంటి హిందీ చిత్రాలకు ఆయన పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 54 ఏళ్ళ సినీప్రస్థానంలో 11 భాషలలో 40 వేల పాటలు పాడి, 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించారు బాలు.
1969లో 'పెళ్ళంటే నూరేళ్ళ పంట' చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించిన ఆయన తర్వాత అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు. పక్కింటి అమ్మాయి (1981), ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) మొదలైనవి ఆయన నటించిన కొన్ని సినిమాలు. బాలు డబ్బింగ్ ఆర్టిస్టుగా అనేకమంది నటులకు గాత్రదానం చేశారు. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వాళ్ళకి డబ్బింగ్ సినిమాల్లో వాయిస్ ఇచ్చారు.
టీవీ రంగంలోనూ తనదైన బలమైన ముద్రవేసిన ఆయన 'పాడుతా తీయగా', 'పాడాలని ఉంది' లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతోమంది నూతన గాయనీ గాయకులను పరిచయం చేశారు. ఇవి కాకుండా ఈటీవీలో ప్రసారమైన 'స్వరాభిషేకం' లాంటి కార్యక్రమాల్లో తన గానాన్ని వినిపించారు.
సినీ రంగానికీ, సంగీత రంగానికీ చేసిన విశేష సేవలకు గాను కేంద్రప్రభుత్వం నుండి 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని బాలు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నారు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు అవార్డులు అందుకున్నారు. 2012లో 'మిథునం' సినిమాలో చేసిన ప్రధాన పాత్రకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది. 2016 నవంబరులో గోవాలో జరిగిన 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ఆయన "సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2016" అవార్డ్ అందుకున్నారు.
Also Read