నా కూతుర్ని ఎత్తుకొని నాలుగో తరం గాయనితోనూ పాడతానన్నారు!: మాళవిక
on Sep 26, 2020
దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి చెందడం భారతీయ చిత్రసీమలో పూడ్చలేని లోటనేది నిర్వివాదాంశం. గాయక కులానికైతే ఆ లోటు మరింత అధికం. రెండు దశాబ్దాలుగా పదులు కాదు.. వందలాది గాయనీ గాయకులను తన టీవీ షోల ద్వారా వెలుగులోకి తెచ్చారాయన. ప్రధానంగా పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఎంతమందిని ఆయన సింగర్స్గా మలిచారో తెలిసిందే. అలాంటివాళ్లలో మాళవిక ఒకరు. బాలుతో పాటు ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొని, ఆయనతో పాటే కరోనా వైరస్ ఇన్ఫెక్షన్కు గురై, దాని నుంచి కోలుకున్న బాలు మృతి చెందారన్న వార్తను తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనను తాను పెదనాన్నా అని పిలుస్తానని చెప్పిన ఆమె, ఆయన పోయారన్న వార్తను ఇంకా నిజమని నమ్మలేకపోతున్నానని చెప్పారు.
"బాలుగారు వెళ్లిపోవడం చాలా బాధగా ఉంది. ఏదైనా అద్భుతం జరుగుతుందేమోనని మేమంతా ఆశించాం. ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అస్సలనుకోలేదు. బాలుగారితో నాకు మంచి అనుబంధం ఉంది. నేను పెదనాన్నా అని పిలుస్తా. నా మ్యూజికల్ కెరీర్లో ఆయనది ముఖ్యమైన స్థానం. నన్నెంతో ఇష్టంతో ప్రోత్సహిస్తూ వచ్చారు. 'పాడుతా తీయగా' ప్రోగ్రామ్లో కానీ, సినిమాల్లో పాడటం కానీ, స్వరాభిషేకంలో, ఇంటర్నేషనల్ షోస్లో, స్టేజ్ షోస్లో.. ఆయనతో ఎన్నెన్ని మంచి అనుభూతులు, ఎన్నెన్ని మంచి స్మృతులు.. మా గాయక కులానికి పెద్ద దిక్కు ఆయన. పాత తరానికి సంబంధించిన విషయాల్ని ఎంతో ఉత్సాహంతో చెప్పేవారు. తెలుగు భాష కోసం ఎంతో పాటు పడేవారు. తన డెడికేషన్తో మమ్మల్ని ఎంతగానో ఇన్స్పైర్ చేసేవారు. మరపురాని ఆ సంగతులన్నీ ఇవాళ జ్ఞాపకానికొస్తున్నాయి. మా ఇంటికొచ్చిన రోజు నా కూతుర్ని ఎత్తుకొని 'ఐ ప్రౌడ్ టు సే ఐ యామ్ సంగ్ విత్ త్రీ జనరేషన్స్ ఆఫ్ ఫిమేల్ సింగర్స్.. నీ కూతుర్ని కూడా పాడుతా తీయగాకు పంపించు. ఫోర్త్ జనరేషన్ ఆఫ్ సింగర్స్తో కూడా పాడతాను నేను.' అని చెప్పిన మాటను నేనస్సలు మర్చిపోలేను. టీవీలో ఎన్ని న్యూస్ చూస్తున్నా ఇది నిజం కాదు.. ఇది నిజం కాకూడదు.. ఏమాత్రం నమ్మాలనిపించట్లేదు" అని బాధపడ్డారు మాళవిక.
Also Read