శింబు మెంబర్ షిప్ ను వదిలేశాడు...!
on Apr 21, 2016
తమిళ నడిగర్ సంఘం ఎన్నికలు సినిమాల్ని మించి రసపట్టులో నడిచాయి. అందరూ సినిమా వాళ్లే అయినా, ఒకరిపై ఒకరు ఆరోపణలు, తిప్పికొట్టడాలు చేసుకున్నారు. శరత్ కుమార్, విశాల్ ల మధ్య గడ్డి వేయకపోయినా మంటలు వచ్చేంత గొడవలు జరిగిపోయాయి. చివరికి విశాల్ అండ్ కో గెలిచి కొత్త ఆఫీస్ ను క్రియేట్ చేశారు. అంతా ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో తమిళ హీరో శింబు మరో వివాదాస్పద పని చేశాడు. శింబు ఎన్నికల్లో శరత్ కుమార్ కు మద్దతు పలకడమే కాక, అప్పట్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. ఈ మధ్య కాలంలో పోలీసులు కేసులు అంటూ బిజీగా ఉన్న శింబు, మళ్లీ నడిగర్ సంఘం వైపుకు రాలేదు.
కానీ ఏమైందో ఏమో, సడెన్ గా తన నడిగర్ సంఘం సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించాడు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఏ సాయం చేయని నడిగర్ సంఘం లో తనకు సభ్యత్వం ఉంటే ఎంత..లేకపోతే ఎంత అంటున్నాడు శింబు. కానీ బీప్ సాంగ్ లాంటి పాటతో వివాదాస్పదమైంది శింబు నే. అతని పాటకు మహిళా సంఘాలు కేసులు పెడితే ఇబ్బంది పడిన విషయం అందరికీ తెలిసిందే. మరి అలాంటి చోట్ల ఏ సంఘమైనా ఎలాంటి మద్దతు ఇవ్వగలదు అంటూ నడిగర్ సంఘం ప్రస్తుత సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇవి కాకపోయినా మిగిలిన వివాదాలన్నీ కూడా శింబుకు వ్యక్తిగతమైనవే. మరి ఈ వివాదాల్లో తనకు మద్దతు ఇవ్వలేదని సాకు చూపి సభ్యత్వానికి శింబు ఎందుకు రాజీనామా చేశాడనేది ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.