'ఎరుపు పసుపుపచ్చ'తో సిద్ధార్థ్ వస్తున్నాడు!
on Aug 6, 2019
తమిళం నుంచి తెలుగులో డబ్ అయిన 'బిచ్చగాడు' సినిమాతో డైరెక్టర్ శశి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో టైటిల్ రోల్ చేసిన విజయ్ ఆంటోని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. ఇప్పుడు శశి మరో డబ్బింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ సినిమా టైటిల్ 'ఎరుపు పసుపుపచ్చ'. తమిళ ఒరిజినల్ పేరు 'శివప్పు మంజల్ పచ్చై'. ఆసక్తి కలిగిస్తున్న ఈ టైటిల్ హీరోల క్యారెక్టర్లకు సంబంధించినవి. ఇందులో ఇద్దరు హీరోలున్నారు. ఒకరు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన సిద్ధార్థ్ కాగా, మరొకరు మ్యూజిక్ డైరెక్టర్ నుంచి యాక్టర్గా మారి అలరిస్తున్న జి.వి. ప్రకాశ్కుమార్.
ట్రాఫిక్ పోలీస్గా సిద్ధార్థ్, ఆకతాయి యువకుడిగా ప్రకాశ్కుమార్ కనిపించే ఈ మూవీలో హీరోయిన్లుగా లిజొమోల్ జోస్, కశ్మీరా పరదేశి నటిస్తున్నారు. రెండేళ్ల క్రితం తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం 'గృహం'తో తెలుగు ప్రేక్షకులను అలరించిన సిద్ధార్థ్, ఇప్పుడు 'ఎరుపు పసుపుపచ్చ'తో మరోసారి ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. 2013లో సమంత జోడీగా చేసిన 'జబర్దస్త్' తర్వాత అతను మళ్లీ తెలుగు స్ట్రెయిట్ సినిమాలో చెయ్యలేదు. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. దాంతో తెలుగులో అతనితో నేరుగా సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.
సిద్ధార్థ్ కూడా తమిళ సినిమాలపైనే దృష్టిపెట్టి, అక్కడ విజయాలు సాధిస్తున్నాడు. తెలుగులో వరుణ్తేజ్ ప్రధాన పాత్రలో తయారవుతున్న 'వాల్మీకి' మూవీ అతడు తమిళంలో చేసిన హిట్ మూవీ 'జిగర్తాండ'కు రీమేక్ కావడం గమనార్హం. ఏదేమైనా స్ట్రెయిట్ సినిమాల కంటే తమిళ డబ్బింగ్ సినిమాలతోనే సిద్ధార్థ్ మన ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడనుకోవాలి.