రి-ఎంట్రీలో హ్యాట్రిక్పై కన్నేసింది!
on Apr 14, 2021
తెలుగు, తమిళ, హిందీ.. ఇలా త్రిభాషా సూత్రం పాటిస్తూ కథానాయికగా తనదైన ముద్ర వేసింది శ్రుతి హాసన్. లోక నాయకుడు కమల్ హాసన్ తనయగా తెరంగేట్రం చేసినా.. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రుతి. మరీ ముఖ్యంగా.. తెలుగులో శ్రుతి నటించిన పలు సినిమాలు విజయం సాధించి తనని సక్సెస్ఫుల్ హీరోయిన్గా నిలిపాయి.
కాగా, 'కాటమరాయుడు' (2017) తరువాత మూడున్నరేళ్ళపాటు తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైన శ్రుతి.. ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన 'క్రాక్'తో రి-ఎంట్రీ ఇచ్చింది. చాన్నాళ్ళ తరువాత బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రి-ఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్'తోనూ తాజాగా మరో హిట్ని సొంతం చేసుకుంది.
ఇలా.. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్బస్టర్స్ చూసిన శ్రుతి.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న 'సలార్'లో నాయికగా నటిస్తోంది. పాన్-ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సాగా 2022 ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది.
మరి.. 'క్రాక్', 'వకీల్ సాబ్' తరువాత రానున్న 'సలార్'తో శ్రుతి రి-ఎంట్రీ హ్యాట్రిక్ అందుకుంటుందేమో చూడాలి.