12 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ రాబట్టిన 'సర్కారు వారి పాట'!
on May 24, 2022
టాక్ తో సంబంధం లేకుండా 'సర్కారు వారి పాట' కలెక్షన్ల జోరు కొనసాగుతూనే ఉంది. 12 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ రాబట్టిందని తెలుపుతూ తాజాగా మేకర్స్ అధికారిక పోస్టర్ విడుదల చేశారు. అయితే ట్రేడ్ వర్గాలు చెబుతున్న లెక్కలకి, దీనికి రూ.30 కోట్ల వ్యత్యాసం ఉండటం విశేషం.
మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సర్కారు వారి పాట'. 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్. ఎన్నో అంచనాల నడుమ మే 12న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు డివైడ్ టాక్ తెచుకున్నప్పటికీ కలెక్షన్ల దుమ్ము దులుపుతోంది. అయితే ఈ మూవీ కలెక్షన్ల విషయంలో మొదటి నుంచి గందరగోళం నెలకొంది. ట్రేడ్ వర్గాల లెక్కలకి, మేకర్స్ పోస్టర్స్ కి పొంతన కుదరడం లేదు.
'సర్కారు వారి పాట' ఐదు రోజుల్లోనే 100 కోట్లకు పైగా షేర్, 160 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి టాలీవుడ్ రీజినల్ సినిమాలలో ఆల్ టైం రికార్డు సృష్టించిందని మేకర్స్ ప్రకటించారు. కానీ ట్రేడ్ వర్గాలు మాత్రం ఈ సినిమా వంద కోట్ల షేర్ మార్క్ అందుకోవడానికి 10 రోజులు పట్టిందని చెబుతున్నాయి. ఇక తాజాగా 12 రోజుల్లో ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. కానీ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా 12 రోజుల్లో దాదాపు 170 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఏవి నిజమైన కలెక్షన్లో అర్థంగాక గందరగోళం నెలకొంది. అయితే ఫ్యాన్స్ మాత్రం ప్రొడ్యూసర్స్ అధికారికంగా ప్రకటించారు కాబట్టి అవే నిజమైన కలెక్షన్స్ అని అంటున్నారు.