"సంద్రం" లోగో లాంచ్
on Sep 9, 2011
శ్రీ సాయి మిత్రా ప్రొడక్షన్స్ పతాకంపై, "సై" అర్జున్ హీరోగా, దీపికను హీరోయిన్ గా పరిచయం చేస్తూ, కుమార్ రాజు ముదునూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, రాజేష్ తెన్నేటి నిర్మిస్తున్న తొలి చిత్రం "సంద్రం". సెప్టెంబర్ 8 వ తేదీన, హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో ఈ "సంద్రం" చిత్రం యొక్క లోగోని, ప్రముఖ పాత్రికేయులు, నిర్మాత, "సూపర్ హిట్" వారపత్రిక అధిపతి అయిన బి.ఎ.రాజు స్వహస్తాలతో ఆవిష్కరించారు. ఈ చిత్రానికి సంగీతం క్రిష్, సినిమాటోగ్రఫీని బి.దుర్గా కిశోర్ నిర్వహిస్తూండగా, ప్రముఖ యువ పాత్రికేయుడు నాగు గవర ఈ చిత్రంలో ఉన్న అయిదు పాటలనూ వ్రాశారు.
ఈ చిత్రం లోగో లాంచింగ్ రోజునే ప్రముఖ సంగీత దర్శకురాలు, గాయని అయిన యమ్.యమ్.శ్రీలేఖ జన్మదినం కావటంతో, ఆమె జన్మదిన వేడుకలను కూడా ఇదే వేదిక మీద జరిపారు. శ్రీలేఖ ఈ "సంద్రం" చిత్రంలో మూడు పాటలను పాడారు. ఈ సందర్భంగా హీరో అర్జున్ ప్రసంగిస్తూ తనకీ అవకాశమిచ్చిన దర్శక, నిర్మాతలకు తన కృతజ్ఞతలు తెలిపారు. పాటల రచయిత నాగు గవర మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తనను తాను ఒక దర్శకుడిగా, రచయితగా నిరూపించుకోటానికి సినీ పరిశ్రమకొచ్చాననీ, అలాంటిది ఆ విషయాన్ని మరచిపోయే సమయంలో తనకు తొలి చిత్రంలోనే అన్నిపాటలూ వ్రాసే అవకాశమిచ్చిన నిర్మాతకు తన కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన బి.ఎ.రాజు ఈ చిత్రం యూనిట్ కు తన శుభాశీస్సులు అందజేశారు.