నెల రోజుల తర్వాత.. క్షేమంగా ఇంటికి వచ్చిన సాయితేజ్!
on Oct 15, 2021
బైక్ ప్రమాదంలో గాయపడి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్ ఈరోజు క్షేమంగా ఇంటికి చేరాడు. అక్టోబర్ 15 అతని పుట్టినరోజు కావడం, అదేరోజు దసరా పండగ రావడం యాదృచ్ఛికం. నెల రోజుల క్రితం రాయదుర్గం దగ్గర రోడ్డుపై బైక్మీద వెడుతూ, స్కిడ్ అయి పడిపోయిన సాయితేజ్కు తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా ఛాతీపై గట్టి దెబ్బలు తగలడంతో స్పృహ కోల్పోయిన అతను మొదట మెడికవర్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స తీసుకుని, ఆ తర్వాత అపోలో హాస్పిటల్కు షిఫ్ట్ అయ్యాడు. అక్కడే నెల రోజుల పాటు డాక్టర్ల నిత్య పర్యవేక్షణలో చికిత్స పొందిన అతను నేడు డిశ్చార్జయి ఇంటికి క్షేమంగా చేరాడు.
ఈ విషయాన్ని ఓ నోట్ ద్వారా సాయితేజ్ మేనమామ అయిన పవన్ కల్యాణ్ వెల్లడించారు. విజయదశమి పర్వదినాన తేజ్ ఆరోగ్యంగా ఇంటికి రావడం తామందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆయన తెలిపారు. "ఈ రోజే తేజ్ పుట్టినరోజు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకొని ప్రేక్షకుల ప్రేమాభిమానాలు మరింతగా పొందాలని ఆ శక్తిస్వరూపిణిని ప్రార్థిస్తున్నాను." అని ఆయన అన్నారు.