`ఆడవాళ్ళు..`కు రష్మిక సెంటిమెంట్!
on Jan 29, 2022
`సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ`, `పుష్ప - ద రైజ్` చిత్రాలతో తెలుగునాట హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది నేషనల్ క్రష్ రష్మికా మందన్న. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో తెలుగు, హిందీ భాషల్లో కలుపుకుని నాలుగు సినిమాలున్నాయి. కాగా, వాటిలో ఒకటైన `ఆడవాళ్ళు మీకు జోహార్లు`.. ఫిబ్రవరి 25న ముందుగా థియేటర్స్ లో ఎంటర్టైన్ చేయనుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. టాలీవుడ్ లో ఫిబ్రవరి నెల రష్మికకి ఎంతో సెంటిమెంట్. ఎందుకంటే.. తను నటించిన మొదటి తెలుగు సినిమా `ఛలో` 2018లో ఇదే ఫిబ్రవరి నెలలో విడుదలై మంచి విజయం సాధించింది. అంతేకాదు.. 2020లో ఇదే ఫిబ్రవరి మాసంలో జనం ముందు నిలిచిన `భీష్మ` కూడా కమర్షియల్ గా మెప్పించింది. ఇలా.. రెండు సార్లు తెలుగు సినిమాల పరంగా ఫిబ్రవరి నెల రష్మికకి భలే అచ్చొచ్చింది. ఈ నేపథ్యంలో.. ముచ్చటగా మూడోసారి ఫిబ్రవరి నెలలో వస్తున్న స్ట్రయిట్ తెలుగు పిక్చర్ `ఆడవాళ్ళు మీకు జోహార్లు` కూడా విజయం సాధిస్తే.. రష్మిక సెంటిమెంట్ కొనసాగి టాలీవుడ్ లో ఆ నెల పరంగా తనకి హ్యాట్రిక్ హిట్ క్రెడిట్ అయినట్టే. మరి.. ఫిబ్రవరి నెలలో రెండేళ్ళకోసారి సందడి చేస్తూ వస్తున్న రష్మిక.. `ఆడవాళ్ళు మీకు జోహార్లు`తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
కాగా, శర్వానంద్ హీరోగా నటిస్తున్న `ఆడవాళ్ళు మీకు జోహార్లు`ని తిరుమల కిశోర్ డైరెక్ట్ చేస్తున్నాడు.