రకుల్ తన ప్రోగ్రెస్ కార్డ్ను రివీల్ చేసింది...!
on Sep 10, 2018
ప్రస్తుతం రకుల్ ప్రీత్సింగ్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. 'స్పైడర్' తర్వాత తమిళంలో మూడు, హిందీలో ఓ సినిమా చేస్తున్నారు. ఆల్మోస్ట్ తెలుగులోని స్టార్ హీరోలు అందరితో రకుల్ నటించారు. మళ్ళీ ఆమెను రిపీట్ చేయడానికి హీరోలు ఆసక్తి చూపించడం లేదనీ, ఇక్కడ ఆమెకు అవకాశాలు తగ్గాయనీ కొందరు కామెంట్ చేశారు. సదరు కామెంట్స్ మీద రకుల్ మండిపడుతోంది. "తెలుగులో నాకు అవకాశాలు లేవని ఎవరన్నారు? మిగతా భాషల సినిమాలతో బిజీగా వుండటంతో డేట్స్ అడ్జట్ చేయలేకపోతున్నా. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా నటించనున్న 'వెంకీమామ'కు సంతకం చేశా. అక్టోబరులో ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది" అని రకుల్ చెప్పింది.
తెలుగులో తన కెరీర్ పట్ల, తన నటనకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందన పట్ల రకుల్ సంతోషం వ్యక్తం చేసింది. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ తెలుగులో 'కెరటం' సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి ఏడేళ్లు దాటుతోంది. 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్'కి రెండేళ్ల ముందు ఆ సినిమా వచ్చింది. ఈ ఏడేళ్లల్లో 15 సినిమాలు చేసింది. అందులో సగం సినిమాలు విజయాలు సాధించలేదని రకుల్ ఓపెన్గా చెప్పింది. "నా సినిమాల్లో సక్సెస్ రేట్ 50 శాతమే కావొచ్చు. కాని ప్రేక్షకులు నా నటనకు, నేను ఎంపిక చేసుకున్న పాత్రలకు 75శాతం మార్కులు వేశారు" అని రకుల్ చెబుతోంది. ఏడేళ్లల్లో తెలుగులో చాలా విషయాలు నేర్చుకుందట. ఎటువంటి కథలు ఎంపిక చేసుకోవాలనే విషయంలో ఓ అవగాహన వచ్చిందని తెలిపింది. అవకాశం వస్తే ఆఫ్ బీట్ సినిమాలు చేయడానికి రెడీ అంటోంది.