'యన్.టి.ఆర్'పై నిర్మాత ఏమంటున్నారంటే?
on Sep 5, 2019
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, అభిమానుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా 'యన్.టి.ఆర్'. క్రిష్ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు, నట సింహ నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ, కన్నడ, ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూశారు. రెండు భాగాలూ ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయాయి. ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించినందుకు తాను గర్వంగా ఫీలవుతున్నాననీ, తాము ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని చిత్ర నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి వ్యాఖ్యానించారు. "గాంధీ జీవితాన్ని, మహా భారతాన్ని ఒక్క సినిమాగా తీసినప్పుడు ఎన్టీఆర్ గారి జీవిత చరిత్రను కూడా ఒక్క సినిమాలో చెప్పాల్సింది. రెండు భాగాలుగా కాకుండా ఒక్క భాగంగా సినిమా వచ్చినట్లు అయితే కచ్చితంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేదని నాకు అనిపించింది. ప్రేక్షకులు ఆశించిన ఏదో కీ పాయింట్ మేం మిస్ అయ్యామని నా ఫీలింగ్. ఏది ఏమైనా ఎన్టీఆర్ బయోపిక్ ఒక ఖరీదైన గుణపాఠం నేర్పింది" అని విష్ణు ఇందూరి అన్నారు. ఆయన నిర్మాణంలో జయలలిత జీవితం ఆధారంగా, జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటించనున్న బయోపిక్ సినిమా షూటింగ్ అక్టోబర్ 15న మొదలు కానుందని తెలిపారు.