'అన్నమయ్య', 'సింహాద్రి' చిత్రాల నిర్మాత దొరస్వామిరాజు మృతి
on Jan 17, 2021
'సీతారామయ్యగారి మనవరాలు', 'అన్నమయ్య', 'సింహాద్రి' చిత్రాలను నిర్మించిన ప్రముఖ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, వియంసీ ప్రొడక్షన్స్ అధినేత వి. దొరస్వామిరాజు సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆయన పూర్తి పేరు వరదరాజు దొరస్వామిరాజు. వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన అస్వస్థతకు గురై, బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. 1946 జూలై 1న చిత్తూరు జిల్లా విజయపురి మండలం వరదరాజుల కండ్రిగ గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు చెంగమ్మ, వెంకట్రాజు.
ఎన్టీ రామారావు నటించిన 'భామా విజయం' సినిమా రాయలసీమ హక్కుల్ని కొనడం ద్వారా ఆయన చిత్ర రంగంలో అడుగుపెట్టారు. పాతిక వేల రూపాయలకు కొన్న ఆ సినిమాని పదివేల రూపాయల లాభానికి అమ్మేశారు. ఆ తర్వాత నాగేశ్వరరావు అనే డిస్ట్రిబ్యూటర్తో కలిసి విజయనిర్మల పిక్చర్స్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థను ప్రారంభించారు. దానిపై తొలిసారి విడుదల చేసిన కృష్ణ, వాణిశ్రీ జంటగా నటించిన 'ఇల్లు ఇల్లాలు'. అది సూపర్ హిట్టయ్యింది. అలాగే శ్రీ ఫిలిమ్స్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థపై కూడా పలు చిత్రాలను పంపిణీ చేశారు.
ఆ తర్వాత ఎన్టీ రామారావు చేతుల మీదుగా సొంతంగా 1978 జూన్ 27న వీయంసీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థను ప్రారంభించారు దొరస్వామిరాజు. ప్రారంభ చిత్రంగా 'వేటగాడు'ను రిలీజ్ చేశారు. అది బ్లాక్బస్టర్ హిట్. అతి తక్కువ కాలంలోనే అగ్రశ్రేణి డిస్ట్రిబ్యూషన్ సంస్థగా వీయంసీ పేరు తెచ్చుకుంది.
ఆ ఉత్సాహంతో 1988లో దొరస్వామిరాజు నిర్మాతగా మారి, నాగార్జున టైటిల్ పాత్రధారిగా 'కిరాయి దాదా'ను నిర్మించారు. అది బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఆ తర్వాత కాలంలో నిర్మించిన సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్గారి పెళ్లాం, మాధవయ్యగారి మనవడు, అన్నమయ్య, సింహాద్రి లాంటి చిత్రాలు ఆయనను అగ్రశ్రేణి నిర్మాతగా నిలిపాయి. శివాజీ హీరోగా నిర్మించిన 'కొంచెం టచ్లో ఉంటే చెప్తా' ఆయన చివరి చిత్రం.
రాజకీయాలలోనూ దొరస్వామిరాజు కొంతకాలం రాణించారు. 1988-89 సంవత్సరంలో మంగళమ్ గ్రామ సర్పంచ్గా పనిచేసిన ఆయన, తర్వాత టీడీపీలో చేరి, 1994లో నగరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.