పెళ్లి తర్వాత ఇన్ని రోజులు... ఇదే తొలిసారి!
on May 12, 2020
"నేను 2002లో ఇండస్ట్రీకి వచ్చా. తర్వాత 11 నెలలు గ్యాప్ వచ్చింది. తర్వాత ఎప్పుడూ ఇంటిలో ఖాళీగా కూర్చోలేదు. ఇదిగో ఇప్పుడీ లాక్ డౌన్ వల్ల మళ్లీ ఇంటిలో ఎక్కువ రోజులు ఉన్నాను. వర్క్, షూటింగ్స్ మిస్ అవుతున్నప్పటికీ, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి ఇదొక మంచి అవకాశం" అని ప్రియమణి అన్నారు. ఎప్పుడూ షూటింగులు, ట్రావెలింగులు అంటూ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబయ్ తిరిగే ఆవిడ... ప్రస్తుతం అత్తగారింట్లో, భర్త ముస్తాఫా రాజ్తో కలిసి ఉంటున్నారు.
"బహుశా... మా పెళ్లి తర్వాత నేను, ముస్తాఫా రాజ్ ఎక్కువ రోజులు కలిసున్నది ఇప్పుడే అనుకుంట. పవిత్ర మాసం రంజాన్ కావడంతో సంతోషంగా ఉంది. మా ఆయన, అత్తయ్యగారు ఉపవాసం ఉంటున్నారు. నేను, మా మావయ్యగారు తినేస్తున్నాం. ఇంటిపనుల్లో నేను అత్తయ్యకు సాయం చేస్తున్నాను. పనులతో పాటు వెబ్ సిరీస్, సినిమాలు చూడడంతో రోజు గడుస్తుంది" అని ప్రియమణి అన్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. వెంకటేష్ సరసన 'నారప్ప'లో నటిస్తున్నారు. రానా దగ్గుబాటి 'విరాటపర్వం'లో కీలక పాత్ర చేస్తున్నారు.