జూనియర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ ద మాసెస్ అయితే.. మరి మహేశ్, బన్నీ?
on Nov 22, 2020
దక్షిణాది ప్రేక్షకులు నడుముకు పడిపోతారని కామెంట్ చేసి, వివాదాన్ని కొని తెచ్చుకున్న టాలీవుడ్ అరవింద పూజా హెగ్డే.. తాజాగా మరో వివాదంలో పడినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ డైరెక్షన్లో చేసిన 'అరవింద సమేత' మూవీ ఎక్స్పీరియెన్స్ గురించి మాట్లాడుతూ, ఆమె చేసిన వ్యాఖ్యలు మహేశ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్కు కోపాన్ని తెప్పించాయి. వాళ్లెందుకు ఆమెపై కోపమొచ్చిందంటారా? ఎందుకంటే.. ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటించిన పూజ ఆయనను ఆకాశానికెత్తేస్తూ మాట్లాడిన మాటలే.
'అరవింద సమేత' తన కెరీర్లో స్పెషల్ ఫిల్మ్గా అభివర్ణించిన ఆమె, "అనేక కారణాల వల్ల నా కెరీర్లో 'అరవింద సమేత 'ఎప్పుడూ ఓ ప్రత్యేక చిత్రమే. జూనియర్ ఎన్టీఆర్తో అది నా తొలి సినిమా. అతనితో కలిసి పనిచేసిన సమయం చాలా గొప్పది.. మ్యాన్ ఆఫ్ ద మాసెస్ అయిన జూనియర్ ఎన్టీఆర్తో పనిచేయడం గొప్పగా ఫీలవుతున్నానని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మా ఇద్దరివీ గ్రేట్ ఎనర్జీ లెవల్స్ కావడంతో దాని ఫలితం సిల్వర్ స్క్రీన్పై వండర్ఫుల్ కెమిస్ట్రీ రూపంలో కనిపించింది." అని చెప్పుకొచ్చింది.
దీంతో ఎనర్జీ లెవల్స్ విషయంలో బన్నీ అందరికంటా ముందుంటాడని నమ్మే ఆయన ఫ్యాన్స్కు ఈ మాటలు ఆగ్రహాన్ని కలిగించాయంటున్నారు. బన్నీతో పూజ రెండు సినిమాలు.. 'డీజే', 'అల.. వైకుంఠపురములో' చేసిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందని కూడా అందరూ అభిప్రాయపడ్డారు. కానీ ఎనర్జీ లెవల్స్ విషయంలో తారక్ను ఆమె పొగడటంతో బన్నీని ఆమె తక్కువ చేసినట్లయ్యిందని ఆయన ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మహేశ్ ఫ్యాన్స్ సైతం ఇలాగే ఫీలవుతున్నారని వినిపిస్తోంది. 'మహర్షి'లో మహేశ్ జోడీగా పూజ నటించింది.
Also Read