`పక్కా కమర్షియల్`.. తండ్రీకొడుకుల కథ!
on May 17, 2021
`ప్రతిరోజూ పండగే` వంటి బ్లాక్ బస్టర్ తరువాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి నుంచి వస్తున్న చిత్రం `పక్కా కమర్షియల్`. యాక్షన్ హీరో గోపీచంద్, స్టన్నింగ్ బ్యూటీ రాశీ ఖన్నా ఇందులో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. `జిల్`, `ఆక్సిజన్` తరువాత గోపి, రాశి జోడీకడుతున్న సినిమా ఇది. ఇందులో ఇద్దరు కూడా లాయర్ వేషాల్లోనే దర్శనమివ్వనుండడం విశేషం. సత్యరాజ్, రావు రమేశ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి సంబంధించి 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఇదిలా ఉంటే.. `పక్కా కమర్షియల్` కోర్టు రూమ్ చుట్టూ తిరిగే సినిమానే అయినా తండ్రీకొడుకుల మధ్య అనుబంధం, వారి భావోద్వేగాల సమ్మేళనంగా తెరకెక్కుతోందట. మారుతి గత చిత్రం `ప్రతిరోజూ పండగే`లో తాతమనవళ్ళ మధ్య సాగే సన్నివేశాలు ఎలాగైతే హైలైట్ గా నిలిచాయో.. అదే విధంగా `పక్కా కమర్షియల్`లోనూ తండ్రీకొడుకుల మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయని సమాచారం. అంతేకాదు, `ప్రతిరోజూ పండగే`లో తాత పాత్రలో కనిపించిన సత్యరాజ్.. `పక్కా కమర్షియల్`లో తండ్రి వేషంలో దర్శనమివ్వనున్నారట. మరి.. ఈ తండ్రీకొడుకుల కథ టైటిల్ కి తగ్గట్టు `పక్కా కమర్షియల్` అనిపించుకుంటుందేమో చూడాలి. కాగా, అక్టోబర్ 1న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.