‘ఓ బేబీ’ హిట్టయితే... మల్టీస్టారర్కు మోక్షం లభించేనా?
on Jul 2, 2019
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహిళా దర్శకులు ఎంతమంది అంటే వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అతి తక్కువ మందిలో నందిని రెడ్డి ఒకరు. 'అలా మొదలైంది'తో దర్శకుడుగా పరిచయమైన ఆమె... రెండో సినిమా 'జబర్దస్త్'తో పరాజయాన్ని చవి చూశారు. మళ్లీ 'కళ్యాణ వైభోగమే'తో హిట్ ట్రాక్ లోకి వచ్చారు. త్వరలో విడుదల కానున్న 'ఓ బేబీ' ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. నిజానికి, 'ఓ బేబీ' కంటే ముందు స్వప్న సినిమా సంస్థలో విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా చేయాలనుకున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ కి అనుబంధ సంస్థ అయిన స్వప్న సినిమాలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేశారు. అయితే అది హీరోగా కాదు... హీరో స్నేహితుడిగా! అదే నాని 'ఎవడే సుబ్రహ్మణ్యం'. తర్వాత వైజయంతి మూవీస్, స్వప్న సినిమా నిర్మించిన 'మహానటి'లోనూ కీలక పాత్ర చేశారు. అప్పుడు విజయ్ దేవరకొండ తో నందినిరెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా ప్లాన్ చేశారు. ఏమైందో ఏమో... ఆ సినిమా గురించి ప్రస్తావిస్తుంటే... నందిని రెడ్డి ఏమీ మాట్లాడడం లేదు. తన తదుపరి సినిమా లో ఎవరు హీరోగా నటిస్తారు ఇప్పుడే చెప్పలేనని ఆమె తెలిపారు.
ప్రస్తుతం నందిని రెడ్డి దగ్గర రెండు కథలు సిద్ధంగా ఉన్నాయట. ఒకటి మల్టీస్టారర్ సినిమా... మరొకటి సోలో హీరో సినిమా. 'ఓ బేబీ' ఫలితంపై ఏ సినిమా పట్టాలెక్కుతుంది? అనేది తెలుస్తుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా... సమంతకు వచ్చిన నష్టమేమీ లేదు. మరో సినిమా తప్పకుండా వస్తుంది. అదే 'ఓ బేబీ' హిట్టయితే నందిని రెడ్డి కి డిమాండ్ ఉంటుంది లేదంటే... మళ్లీ తీవ్ర ప్రయత్నాలు చేయక తప్పదు.