తేజాని బాలయ్య పిలిచాడా..?
on Sep 16, 2017
ప్రస్తుతం టాలీవుడ్లో ప్రముఖంగా వినిపిస్తున్న టాపిక్కుల్లో ‘ఎన్టీయార్ బయోపిక్’ ఒకటి. ‘రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని దర్శకుడు’ అని గతంలో ప్రకటన రాగానే... ఎన్టీయార్ అభిమానులందరూ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఎన్టీయార్ కుటుంబ సభ్యలు కూడా ఈ నిర్ణయాన్ని విభేదించారు. దాంతో ఆ ప్రాజెక్ట్ ని ప్రస్తుతానికి పక్కనపెట్టాడు బాలయ్య.
ఇప్పుడు మళ్లీ బాలయ్య... ఆ కథకు దర్శకుడ్ని వెతికే పనిలో పడ్డట్టు సమాచారం. ఇందులో భాగంగా దర్శకుడు తేజాకు బాలయ్య నుంచి పిలుపు వచ్చిందని ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్త. ఈ చిత్రానికి తేజా దర్శకత్వం వహించనున్నట్లు అప్పుడే సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది కూడా. అయితే.. ‘తెలుగువన్’ సమాచారం ప్రకారం... ఆ ప్రాజెక్ట్ కి దర్శకుడు ఇంకా ఫైనల్ కాలేదు. తేజాని దర్శకునిగా ఖరారు చేశారు అనేదాంట్లో ఏ మాత్రం నిజం లేదు. అయితే... బాలయ్య దృష్టిలో కొంతమంది దర్శకులున్నారు. వారిలో తేజా కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
స్వతహాగా ఎన్టీయార్ కి వీరాభిమాని అయిన తేజా.. ఇటీవలే ‘నేనే రాజు నేనే మంత్రి’తో మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చాడు. రాజకీయ నేపథ్యం ఉన్న ఆ కథను సమర్థవంతంగా హేండిల్ చేశాడు కూడా. సో... ఎన్టీయార్ బయోపిక్ ని కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ తేజా లో ఉందని కొందరి వాదన. అయితే... బాలయ్య నుంచి తేజాకి ఎలాంటి పిలుపూ రాలేదు. తేజాకి కాలం కలిసొస్తే... రావొచ్చేమో. చెప్పలేం.