'అల..' చూసి నాగ్ మామ మెసేజ్ చేశారు!
on Mar 24, 2020
'చి.ల.సౌ' హిట్ తర్వాత సోలో హీరోగా సుశాంత్ కెరీర్ స్పీడ్ అందుకుంటుందని అక్కినేని అభిమానులు, సగటు తెలుగు సినిమా ప్రేక్షకులు భావించారు. కానీ, ప్రజలందరి అంచనాలకు భిన్నంగా రాకరాక సోలో హీరోగా హిట్టొస్తే... ఆ తర్వాత 'అల.. వైకుంఠపురములో' సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు. 'అల...' కథ చెప్పిన తర్వాత ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోమని త్రివిక్రమ్ తనతో చెప్పారని సుశాంత్ తెలిపారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్, టబు, పూజా హెగ్డే వంటి టీమ్తో పనిచేస్తే లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ టైపులో ఉంటుందని చేశానని అతడు అన్నాడు. విజయవంతమైన సినిమాలో తానో భాగం కావడం సంతోషంగా ఉందన్నాడు.
"అల.. వైకుంఠపురములో సినిమా చూసి నాగ్ (నాగార్జున అక్కినేని) మామ మెసేజ్ చేశారు. నా క్యారెక్టర్ పరంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు" అని సుశాంత్ లేటెస్టుగా చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, నాగార్జున మేనల్లుడిగా సుశాంత్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పన్నెండు ఏళ్లలో ఎనిమిది సినిమాలు మాత్రమే చేశాడు. తాను నటించిన ప్రతి సినిమా సంతృప్తి ఇవ్వడమో లేదా ఏదొక పాఠం నేర్పాడమో చేశాయని అన్నాడు. కెరీర్ స్టార్టింగులో సేఫ్ గేమ్ ఆడటానికి ట్రై చేశానని, ఇప్పుడు ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని సుశాంత్ అంటున్నాడు. ప్రజెంట్ 'ఇచట వాహనములు నిలపరాదు' సినిమా చేస్తున్నాడు.