అంగరంగ వైభవంగా మురళీమోహన్ స్వర్ణోత్సవం!
on Mar 19, 2024
సీనియర్ నటులు మురళీ మోహన్ సినీ పరిశ్రమలో వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా, తెలుగు సినిమా వేదిక ఘనంగా ఆయన్ని సత్కరించాయి. సంస్థ అధ్యక్ష కార్యదర్సులు చైతన్య జంగా, వీస్ విజయ్ వర్మ పాకలపాటి, నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర ప్రసాద్, సెక్రటరీ ప్రసన్న కుమార్, వ్యాపార వేత్త కోగంటి సత్యం మరియు 20 మంది యువ కధానాయకుల సమక్షంలో పండితుల వేదమంత్రాల మధ్య మురళిమోహన్ని ఘనంగా సత్కరించారు.
ప్రసాద్ ల్యాబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో మురళీమోహన్ మాట్లాడుతూ... ‘అట్లూరి పూర్ణచంధ్రరావుగారి చేతుల మీదుగా 33వ ఏట కళామతల్లి ఆశీస్సులు పొందిన నేను నటునిగా, వ్యాపారవేత్తగా విజయవంతంగా రాణించాను. ఈ క్రమంలో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అన్నారు. ఇదే వేదికపై ఇటీవల జరిగిన ఎన్నికలలో వీరశంకర్ దర్శకుల సంఘం అధ్యక్షునిగా విజయం సాధించిన నేపథ్యంలో ఆ సంఘం.. కార్యవర్గాన్ని, శుభోదయం సుబ్బారావు నేతృత్వంలో విజయం సాధించిన తెలంగాణ మూవీ టెలివిజన్ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని మురళీమోహన్ సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
నిర్మాతల మండలి అధ్యక్ష కార్యదర్సులు దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, ఉపాధ్యక్షులు వశిష్ఠ, తెలంగాణ ఆర్టిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు రాజశేఖర్ తదితరులు మురళీ మోహన్ ఔనత్యాన్ని కొనియాడారు. స్వర్ణోత్సవ వేళ ఓ గొప్ప నటుడ్ని సత్కరించుకొనే అవకాశం రావడం పట్ల చైతన్య జంగా, విజయ్ వర్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రామ్ రావిపల్లి అందించిన ప్రశంసా పత్రం, రమేష్ చేసిన మిమిక్రీ అందర్నీ ఆకట్టుకొంది.
జర్నలిస్టులు ధీరజ్ అప్పాజీ, కూనిరెడ్డి శ్రీనివాస్లను మురళీమోహన్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముంబై నుండి విచ్చేసిన నటీమణులు దని బోస్, అనీషా ముఖర్జీ, రోజా భారతి, సౌమ్య జాను, ముంతాజ్ తదితర వర్ధమాన నటీమణులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు!!
Also Read