రెండొందల దేశాల ప్రేక్షకులు చూసే అవకాశం ఉందిగా!
on May 21, 2020
నిర్మాతలపై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కన్నెర్ర చేయడానికి కారణమైంది ఓటీటీ. లాక్డౌన్ కారణంగా థియేటర్లు బంద్ కావడంతో అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన 'గులాబో సితాబో', విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన 'శకుంతలా దేవి' తదితర సినిమాను ఓటీటీల్లో విడుదల చేయాలని నిర్మాతలు సిద్ధమవడంతో ఐనాక్స్, పీవీఆర్ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆగ్రహావేశాలను అందరికంటే ముందు దక్షిణాదిలో సూర్య, జ్యోతిక దంపతులు చవిచూశారు.
జ్యోతిక ప్రధానపాత్రలో నటించిన తమిళ సినిమా 'పొంమగళ్ వందాల్'. సూర్య నిర్మించారు. థియేటర్లు బంద్ చేయడంతో ఓటీటీలో విడుదల చేయాలని రెడీ అయ్యారు. దాంతో డిస్ట్రిబ్యూషన్ సంఘాలు భగ్గుమన్నాయి. సూర్య సినిమాలను సైతం థియేటర్లలో విడుదల చేయబోమని హెచ్చరించారు. ఓటీటీ విడుదల విషయమై జ్యోతిక తాజాగా స్పందించారు.
"ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు భారీ రిలీజులు ఉండవు. ఎక్కువమంది ప్రేక్షకులు ఎగబడి చూడరు. ఈ సమయంలో ఓటీటీ సంస్థలు మాకు సహాయం చేస్తున్నాయి. స్పేస్ కల్పిస్తున్నాయి. ఇప్పుడు మా సినిమాను ప్రపంచవ్యాప్తంగా రెండొందల దేశాల్లో చూసే అవకాశం ఉందిగా. ఎక్కువమందికి సినిమా చేరువ అవుతుంది కదా" అని జ్యోతిక అన్నారు. ఆమె చెప్పేదీ పాయింట్ ఏ కదా!
Also Read