చిరు ఎందుకు క్లిక్ అవ్వలేదు..కారణమేంటి??
on Feb 28, 2017
మీలో ఎవరు కోటీశ్వరుడు పోగ్రాం చిరంజీవి చేతుల్లోకి వెళ్లిందనగానే.. యావత్ ఛానల్ ప్రపంచం... ఎటెన్షన్కి వచ్చేసింది. చిరు రాకతో మీలో ఎవరు కోటీశ్వరుడు ఎక్కడికో వెళ్లిపోతుందని, మిగిలిన షోలన్నీ చిన్నబోతాయని భావించారు. ఎందుకంటే... తెలుగునాట చిరంజీవి తిరుగులేని స్టార్. చిరుకున్న ప్రజాదరణ, ఫాలోయింగ్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తరవాత, అదీ రాజకీయాల్లో ఫ్లాప్ అయి.. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా చిరుకి బ్రహ్మరథం పట్టారు. రికార్డు వసూళ్లతో ఖైదీ నెం.150ని విజయశిఖరాలకు చేర్చారు. అలాంటి చిరు బుల్లితెరపైకి వస్తున్నాడంటే.. మీలో ఎవరు కోటీశ్వరుడు బాధ్యతల్ని స్వీకరిస్తున్నాడంటే ఆ అంచనాలు మామూలుగా ఉండవు. అందుకే అందరి దృష్టి ఎమ్ఈకే వైపుకు మళ్లింది. చిరు ఈ కార్యక్రమాన్ని ఎలా నడిపిస్తాడో?? ఈ షోకి రేటింగులు ఎలా వస్తాయో అంటూ కాచుకొని కూర్చుంది టీవీ మీడియా.
అయితే.. ఈ షోకి వచ్చిన రేటింగులు చూసి షో నిర్వాహకులే కాదు, మెగా ఫ్యాన్స్ మొత్తం చిన్న బోయారు. 5.8 రేటింగుతో.. ఓ మామూలు షోగా మిగిలిపోయింది ఎమ్ఈకే. ఓ హిట్ సినిమాని టీవీలో తొలిసారి వేసినప్పుడు కనీసం 12 నుంచి 15 వరకూ రేటింగులు వస్తుంటాయి. ఆ లెక్కన చూస్తే ఓ యావరేజ్ సినిమా రేంజ్ కూడా ఈ షోకి లేదన్న మాట. చిరు ఈ షోని ఆకాశంలో కూర్చోబెడతారు అని నమ్మిన వాళ్లంతా ఇప్పుడు మాట మార్చేస్తున్నారు. చిరు ఇలాంటి షోలు నిర్వహించడానికి సరిపోడని తేల్చేస్తున్నారు.
చిరు,.. ఆడియన్స్తో అంతగా మింగిల్ అవ్వలేకపోయాడని, రియాలిటీ షోకి కావల్సిన డ్రామా పండించలేకపోతున్నాడని అందుకే... చిరు క్లిక్ అవ్వలేదని చెబుతున్నారు. అదీ నిజమే. ఏ షో చూసినా... ఆర్టిఫిషియల్గానే కనిపిస్తోంది. పైగా సామాన్యులతో ఆడింది తక్కువ. సెలబ్రెటీలతో ఆడింది ఎక్కువ. ఎప్పుడైతే ఓ సామాన్యుడు హాట్ సీట్లో కూర్చుని.. లక్షలకు లక్షలు సంపాదిస్తాడో.. అప్పుడే ఇలాంటి షోలపై జనాలకు నమ్మకం కలుగుతుంది. దానికి తోడు.. యండమూరి వీరేంద్రనాధ్ మీలో ఎవరు కోటీశ్వరుడు షో అంతా అంబక్ అని ఇచ్చిన స్టేట్ మెంట్కి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం లభించింది. అది కూడా రేటింగులపై విపరీతమైన ప్రభావం చూపించింది అంటున్నారు విశ్లేషకులు. మెల్లిమెల్లిగా చిరు పుంజుకొంటాడని, ఈ షోని రక్తికట్టించడం ఖాయమని, దానికి కొంత సమయం పడుతుందని ఇంకా మెగా అభిమానులు నమ్ముతూనే ఉన్నారు. వాళ్ల నమ్మకం నిజం కావాలని ఆశిద్దాం.