ఆ క్లబ్ 'మెగా కాంపౌండ్' హీరోలకే ప్రత్యేకమా?
on Apr 9, 2020
యూట్యూబ్ ముంగిట తెలుగు పాటలు 100 మిలియన్ వ్యూస్ దక్కించుకోవడం అన్నది కొంత కాలం క్రితం వరకు రేర్ ఫీట్ అయితే... ఇప్పుడు పదికి పైగా టాలీవుడ్ సాంగ్స్ ఈ క్లబ్ లో అవలీలగా చేరిపోయాయి. అంతేకాదు.. 100 మిలియన్ వ్యూస్ తరువాత నెక్స్ట్ మైల్ స్టోన్ అయిన 200 మిలియన్ల వ్యూస్ (20 కోట్ల వ్యూస్) క్లబ్ లోనూ స్థానం దక్కించుకుంటున్నాయి.
తొలుత ఈ క్లబ్ లో 'ఫిదా' చిత్రంలోని 'వచ్చిండే' గీతం స్థానం దక్కించుకుంటే.. ఆపై 'రంగస్థలం'లోని 'రంగమ్మ మంగమ్మ' పాట అదే బాట పట్టింది. ఇక వెరీ రీసెంట్ గా.. 'అల వైకుంఠపురములో' చిత్రంలోని 'రాములో రాములా' సాంగ్ కూడా 200 మిలియన్ క్లబ్ లో జాయిన్ అయింది. 'వచ్చిండే', 'రంగమ్మ మంగమ్మ' రెండు కూడా ఫుల్ వీడియో సాంగ్స్ గా ఈ క్లబ్ లో సందడి చేస్తే.. 'రాములో రాములా' మాత్రం లిరికల్ వీడియో సాంగ్ గానే సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు.. కొద్ది రోజుల క్రితం వరకు మొదటి స్థానంలో కొనసాగుతున్న 'వచ్చిండే'ని అధిగమించి మరీ నంబర్ వన్ స్టేటస్ కి చేరుకుంది 'రాములో రాములా'.
మొత్తంగా.. 200 మిలియన్లకి పైగా వ్యూస్ పొందిన తెలుగు పాటల్లో 'రాములో రాములా' మొదటి స్థానంలోనూ, 'వచ్చిండే' రెండో స్థానంలోనూ, 'రంగమ్మ మంగమ్మ' మూడో స్థానంలోనూ సందడి చేస్తున్నాయనే చెప్పాలి. ఇక 200 మిలియన్లకి దరిదాపుల్లో ఉన్న పాటంటే.. అది కూడా 'అల వైకుంఠపురములో' చిత్రంలోని 'సామజవరగమన' మేకింగ్ వీడియోనే. దాదాపు 180 మిలియన్ వ్యూస్ ఈ వీడియోకి ఉన్నాయి.
ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. 200 మిలియన్ క్లబ్ లో సందడి చేస్తున్న మూడు తెలుగు పాటలు కూడా 'మెగా కాంపౌండ్' హీరోలవే కావడం. 'అల వైకుంఠపురములో'లో అల్లు అర్జున్ కథానాయకుడు కాగా.. 'ఫిదా'లో వరుణ్ తేజ్ హీరో. ఇక 'రంగస్థలం'లో రామ్ చరణ్ కథానాయకుడు. సో.. ప్రస్తుతానికి తెలుగు గీతాల 200 మిలియన్ క్లబ్.. మెగా కాంపౌండ్ హీరోలకే ప్రత్యేకం అనక తప్పదేమో. మరి.. ఈ క్లబ్ లో చేరే 'నాన్ - మెగా కాంపౌండ్' స్టార్ ఎవరవుతారో చూడాలి.