ENGLISH | TELUGU  

ఒరేయ్ పులీ! కాసేపు నువ్వు పువ్వు మూసుకుని గమ్మున ఉండరా!!

on Jul 4, 2023

 

పచ్చటి తోటలు.. వాటి మధ్యలో ఊరు.. ఆ ఊరి మధ్యలో ఓ అమ్మవారి గుడి.. వందల మంది ప్రజలు.. పొలాలు పచ్చగా ఉంటే, ప్రజల కళ్ళల్లో ఆశ్చర్యంతో కూడిన భయం! ఆఖరికి మూగ జంతువుల కళ్ళలో కూడా! అందుకు కారణం ఏమిటి?.. అనేది తెలియాలంటే డైరెక్టర్ అజయ్ భూపతి కొత్త సినిమా 'మంగళవారం' థియేటర్లలోకి వచ్చే వరకు వెయిట్ చేయాలి.

'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అజయ్ భూపతి సరికొత్త వినోదాన్ని పరిచయం చేశారు. ఇంటెన్సిటీతో కూడిన యాక్షన్, రొమాన్స్, షాకింగ్ ట్విస్ట్‌లను కలిపి కల్ట్ సినిమా చూపించారు. 'మహాసముద్రం'లో యాక్షన్ డోస్ మరింత పెంచారు. ఆ రెండు సినిమాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన తాజా సినిమా 'మంగళవారం'. ఇందులో పాయల్ రాజ్‌పుత్ ఓ ప్రధాన పాత్రధారి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోంది. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ నేడు విడుదల చేశారు. 

'మంగళవారం' టీజర్ నిడివి 60 సెకన్లకు కొంచెం ఎక్కువ. అయితే, ఆ తక్కువ సమయంలోనే అజయ్ భూపతి చాలా అంశాలు చూపించి ఆసక్తి రేకెత్తించారు. ఊరి ప్రజలు ఏం చూస్తున్నారు?.. అనేది ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే... 'ఏం చూశారండీ?' అని లక్ష్మణ్ అడిగితే "ఒరేయ్ పులీ! కాసేపు నువ్వు పువ్వు మూసుకుని గమ్మున ఉండరా" అని అజయ్ ఘోష్ సమాధానం ఇచ్చారు. తుపాకీతో చైతన్య కృష్ణ గురి పెట్టడమూ చూపించారు. ఊరిలోకి పులి వచ్చిందా? లేదంటే ఏమైనా జరిగిందా?'' అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 

టీజర్ ఎండింగ్ అయితే మరింత క్యూరియాసిటీ కలిగించింది. అమ్మవారి మాస్క్ ఎవరో తీసుకోవడం, గొంగళి కప్పుకొని మంటల మధ్యలో పాయల్ నిలబడటం, చివరిలో గట్టిగా ఆవేదన వ్యక్తం చేస్తూ అరవడం... ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలే. ప్రేక్షకుల్లో ఆలోచన కలిగించినవే. ఈసారి అజయ్ భూపతి ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తూ భయపెట్టడానికి రెడీ అయినట్టు ఉన్నారు. ఆయన విజువల్స్‌కు తోడు అజనీష్ లోక్‌నాథ్ అందించిన నేపథ్యం సంగీతం కళ్ళు అప్పగించి చూసేలా చేసింది. 

టీజర్ రిలీజ్ సందర్భంగా నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఎం. మాట్లాడుతూ ''దర్శకుడిగా అజయ్ భూపతి తాను ఏంటో నిరూపించుకున్నారు. కంటెంట్ తో కూడిన కమర్షియల్ ఫిల్మ్స్ తీశారు. ఈసారి నెక్స్ట్ లెవల్ సినిమా ప్రేక్షకులకు చూపించబోతున్నారు. విడుదలైన కొన్ని క్షణాల్లో 'మంగళవారం' టీజర్ ట్రెండింగ్ అయ్యింది. ప్రేక్షకుల నుంచి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ లభించింది. సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని చెప్పారు.  

చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ''గ్రామీణ నేపథ్యంలో మన తెలుగు నేటివిటీతో కూడిన కథతో తీస్తున్న చిత్రమిది. ఇదొక డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. సినిమాలో మొత్తం 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకు ప్రాముఖ్యం ఉంటుంది. 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. నేపథ్య సంగీతం సినిమా హైలైట్స్‌లో ఒకటి అవుతుంది'' అని చెప్పారు.

'మంగళవారం' చిత్రానికి అజయ్ భూపతి 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ ఎం. తో కలిసి చిత్రాన్ని నిర్మిస్తోంది. 

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, మ్యూజిక్: 'కాంతార' ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్, ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్ళపల్లి, మాటలు: తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్, ఆర్ట్ డైరెక్టర్: మోహన్ తాళ్లూరి, ప్రొడక్షన్ డిజైనర్: రఘు కులకర్ణి,  ఫైట్ మాస్టర్స్: రియల్ సతీష్, పృథ్వీ, సౌండ్ డిజైనర్ & ఆడియోగ్రఫీ: 'నేషనల్ అవార్డ్ విన్నర్' రాజా కృష్ణన్, కొరియోగ్రఫీ: భాను, కాస్ట్యూమ్ డిజైనర్: ముదాసర్ మొహ్మద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయికుమార్ యాదవిల్లి, నిర్మాతలు : స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : అజయ్ భూపతి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.