తమిళనాట ఆసక్తి రేపుతున్న ప్రతినిథి రీమేక్..!
on May 11, 2016
నారారోహిత్ హీరోగా వచ్చిన సినిమా ప్రతినిథి. ఒక సామాన్యుడికి ఆగ్రహం వస్తే ఏమవుతుంది అన్నది సినిమాకు బేసిక్ లైన్ గా తీసుకుని ప్రతినిధి సినిమాను తెరకెక్కించారు. ఆసక్తికరమైన మలుపులతో సాగే ఈ సినిమాకు మంచి సినిమా అని పేరైతే వచ్చింది గానీ, యావరేజ్ కలెక్షన్లతో నడిచింది. ప్రతినిథి రిలీజైన ఇన్నాళ్ల తర్వాత ఆ సినిమాను తమిళంలో కో 2 అన్న పేరుతో రీమేక్ చేశారు. జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కానీ, టీజర్లు ట్రైలర్లు చూసి తమిళ తంబీలు సినిమా గురించి ఎగ్జైట్ అవుతున్నారు. ప్రస్తుతం ఎలక్షన్ సీజన్ నడుస్తుండటమే అందుక్కారణం. తెలుగులో ముఖ్యమంత్రి పాత్రలో కోట శ్రీనివాసరావు చేస్తే, తమిళంలో ప్రకాష్ రాజ్ ఆ పాత్రను పోషించారు. శరత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కో 2 లో నిక్కీ గల్రానీ హీరోయన్ గా నటిస్తోంది. గతంలో తమిళ సినిమా కో ను తెలుగులో రంగం పేరుతో డబ్ చేశారు. ఇక్కడ అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు తెలుగు రీమేక్ అయిన ప్రతినిథికి తమిళంలో కో 2 అని పేరు పెట్టడం విశేషం.